హిందూ జీవన విధానంలో భారతీయ సంస్కృతిలో హోలీ పండుగకు అంత్యంత ప్రాధాన్యం ఉన్నది. వసంతాన్ని పండుగగా జరుపుకోవడంహోలీ సంప్రదాయం. సాధారణంగా శీతాకాలంలో ఫాల్గుణమాసం చివరి పౌర్ణమి రోజున జరుపుకుంటుంటాం. హోలీని జరుపుకోవడానికి మన పౌరాణిక ఇతిహాసాల్లో ఎన్నో కథలు ఉన్నాయి. వాటి కథనం ఏదైనా అంతిమంగా రంగులతో వసంతాన్ని ఆస్వాదించడమే. హోలీ పండుగ నేపథ్యంలో మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎలా జరుపుకుంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
మణిపూర్లో హోలీ వేడుకలు ఆరు రోజులపాటు జరుపుకుంటారు. దీనినే వారి భాషలో యావోసాంగ్ అంటారు. యావోసాంగ్ అంటే పౌర్ణమి మధ్యాహ్నం నగరం లేదా గ్రామంలోని ఒక నది లేదా సరస్సు ఒడ్డున నిర్మించిన ఒక చిన్న గుడిసె అని అర్థం. అందులో చైతన్య మహాప్రభు విగ్రహం ఏర్పాటు చేసి ఆరాధిస్తారు. అనంతరం విగ్రహాన్ని బయటకు తీసి గుడిసెకు నిప్పుపెడతారు. ఆ గుడిసె భోగి మంటలా కాలిపోతుంది. ప్రజలు యావోసాంగ్ బూడిదను నుదిటిపై, వారి ఇళ్ల తలుపుల మీద పూసుకుంటారు. మరుసటి రోజున పిచ్కారి.. ప్రజలు ఒకరినొకరు చల్లుకుంటారు. పిల్లలు బియ్యం, కూరగాయలు సేకరించడానికి ఇంటింటికి వెళ్లి సేకరించి బంతి భోజనం ఏర్పాటు చేస్తారు. మణిపూర్ సాంప్రదాయ జానపద నృత్యం తబల్ చోంగ్బా ప్రదర్శిస్తారు.
పశ్చిమ బెంగాల్లో హోలీని డాల్ ఫెస్టివల్ అని, వసంతోత్సవ్ అని, డాల్ పూర్ణిమ, డోల్జాత్రా అని కూడా పిలుస్తారు. ఈ రోజు బెంగాల్ అంతటా ప్రజలు రంగులు, గులాల్ చల్లుకుంటారు. హోలి కా దహన్ డోల్కు ఒక రోజు ముందు జరుగుతుంది. దీనిని నేడా-పోడా అని పిలుస్తారు. హోలి కా దహన్ను కొన్ని జిల్లాల్లో చంచల్ అని కూడా పిలుస్తారు. డాల్ పౌర్ణమి రోజున, కృష్ణుడు రాధా, ఆమె స్నేహితులతో కలిసి రంగులో తడిసిపోయాడని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. శాంతి నికేతన్లో డాల్ పండుగ రోజున ప్రత్యేక దుస్తులలో వచ్చి రవీంద్ర సంగీతంతో వసంతోత్సవం జరుపుకుంటారు. ఉదయం డోల్జాత్రా లేదా డాల్ పండుగ రోజున ఇక్కడి విద్యార్థులకు “ఒరే ఘర్బాసి ఖోల్ డోర్ గేమ్” నిర్వహిస్తారు. అబీర్ ఆడుతూ బాలికలు క్యాంపస్లోని వివిధ భవనాలకు వెళ్తి శుభాకాంక్షలు చెప్తారు.
ఒడిశాలోని సముద్రతీర జిల్లాల్లో డోలా ఉత్సవ్ చాలా ప్రసిద్ది చెందింది. మదన్ కామదేవ్ గౌరవార్థంగా నమ్ముతున్న మదనోత్సవ కాలక్రమేణా డోలా పండుగగా మారింది. ఈ రోజున కృష్ణుడిని మదన్ మోహన్ గా పూజిస్తారు. డోలా ఉత్సవ్ ఈ ఏడాది మార్చి 23 నుంచి ప్రారంభమైంది. డోలా ఉత్సవ్ సందర్భంగా మదన్ మోహన్ పల్లకీని ఊరేగిస్తారు. ఈ ఊరేగింపు ఇళ్ల ముందు ఆగినప్పుడు ప్రజలు నైవేద్యం అర్పిస్తారు. ఇది నాలుగు రోజులపాటు కొనసాగుతుంది. ఈ సంప్రదాయాన్ని చాచేరి అంటారు. ఈ పండుగ పౌర్ణమి రోజున ముగుస్తుంది. ఈ సమయంలో విగ్రహాలను బహిరంగ ప్రదేశాల్లో పూజిస్తారు. పక్షం 14 వ రోజున గడ్డితో గుడిసె తయారు చేసి హోలిపోడా అనగా హోలిక దహన్ నిర్వహిస్తారు.
పంజాబ్లోని శ్రీ ఆనందపూర్ సాహిబ్ వద్ద హోలీ మరుసటి రోజు జరగనున్న ఈ ఉత్సవాన్ని హోలా మొహల్లా అంటారు. పదవ సిక్కు గురు గోవింద్ సింగ్ హోలీ కోసం హోలా మొహల్లా అనే పదాన్ని ఉపయోగించారు. ఇది శౌర్యానికి చిహ్నంగా చెప్పుకుంటారు. ఈ పండుగ మూడు రోజులు ఉంటుంది. ఈ సందర్భంగా నిహాంగ్ స్వారీ గుర్రాలు వారి ప్రత్యేక ఆయుధాలతో యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు. గురు గోవింద్ సింగ్ ఈ పండుగను స్వయంగా ప్రారంభించినట్లు భావిస్తున్నారు. హోలా మొహల్లా ప్రారంభించే ముందు ఒకరినొకరు గులాలు విసురుకోవడం సంప్రదాయం.
ఫాల్గుణ మాసం మొదటి ఆదివారం రోజున ఇక్కడ హోలీ పండుగ ప్రారంభమవుతుంది. ఇందులో మహిళలు, పురుషులు కూర్చుని హోలీని జరుపుకుంటారు. భగవంతునికి అంకితం చేసిన సాంప్రదాయ పాటలు పాడతారు. మహిళలు మాత్రమే హోలీని సేకరించి జరుపుకునేటప్పుడు దీనిని మహిళా హోలీ అంటారు. దీనిని సాధారణంగా హోలీ ఇండ్ల ప్రాంగణాల్లోనే కూర్చుని జరుపుకుంటారు. హోలికాష్టమిలో గ్రామాలు, నగరాల్లోని బహిరంగ ప్రదేశాలలో ఏకాదశి ముహూరత్ నిర్వహిస్తారు. ఇందులో గణపతితో పాటు అన్ని దేవతలను కొలుస్తారు.
మలయాళీ మాట్లాడేవారు సాధారణంగా హోలీని జరుపుకోరు. ప్రధానంగా గౌడ్ సారస్వత్ బ్రాహ్మణులు, కొంకణి మూలానికి చెందిన కుడుంబి సంఘం వారు మాత్రమే హోలీని జరుపుకుంటారు. ఇక్కడ హోలీని మంజల్ కులీ లేదా ఉకులి అంటారు. రాష్ట్రంలోని 20 దేవాలయాల్లో నాలుగు రోజులపాటు హోలీ వేడుకలను నిర్వహిస్తారు. అతిపెద్ద కార్యక్రమం కొచ్చిలోని తిరుమల గోస్రిపురం కొంకణ్ ఆలయంలో జరుగుతుంది. కొన్ని దేవాలయాలలో ఒక పోక చెట్టును కత్తిరిస్తారు. ఈ చెట్టు రాక్షసులపై దుర్గా మా సాధించిన విజయానికి ప్రతీక అని నమ్ముతారు. మరికొన్ని దేవాలయాలలో మొసలిని దేవత చిహ్నంగా భావించి పూజిస్తారు. పండుగ చివరి రోజు కుడుంబి సమాజం పసుపును నీటిలో కలిపి ఒకదానికొకటి కలుపుతుంది. ఈ సమయంలో అందరూ సాంప్రదాయ పాటలకు నృత్యం చేస్తారు.. పాటలు పాడతారు.
రాజస్థాన్లో హోలీని మిగతా ఉత్తర భారతదేశాల మాదిరిగానే జరుపుకుంటారు. కాని వారి శైలి కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని పాత రాజకుటుంబాలలో.. లేక్సిటీ ఉదయపూర్ దీనికి ప్రసిద్ది చెందింది. హోలీ ఇక్కడ వరుసగా రెండు రోజులు జరుపుకుంటారు. సిటీ ప్యాలెస్ మైదానంలో ప్రధాన రోజు ముందు సాయంత్రం వేడుక ప్రారంభమవుతుంది. ఈ పండుగను మేవార్ హోలిక దహన్ అని కూడా అంటారు. ఈ హోలీ దహన్ సందర్భంగా మేవార్ పూర్వపు రాజకుటుంబ సభ్యులు కొన్నేండ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం హోలీని తగలబెడతారు. మరుసటి రోజు రాజ కుటుంబం నగరంలో పెద్ద ఊరేగింపును నిర్వహిస్తుంది. పట్టణ ప్రజలు ఈ ఊరేగింపును రంగులు, తీపితో స్వాగతిస్తారు. ఈ ఊరేగింపును చూసేందుకు వందలాది విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు.
గోవాలో ఈ పండుగను షిగ్మో అని పిలుస్తారు. ఇది ప్రధానంగా గోవాలోని గిరిజన సమాజం వరి పంట కోసం నిర్వహించుకునే వేడుక. ఈ పండుగ కున్బీ, గావాడ్, వెలిప్స్ సహా వ్యవసాయ సమాజానికి వసంతకాలం ప్రారంభమవుతుంది. ఫాల్గుణ-చైత్ర మాసంలో పక్షం రోజుల పాటు షిగ్మో పండుగ జరుపుకుంటారు. ఇది ప్రతి సంవత్సరం మార్చి-ఏప్రిల్లో జరుగుతుంది. గ్రామాల్లోని స్థానిక జానపద దేవతలకు నామన్ అనే పిలుపుతో పండుగ జరుపుకుంటారు. సాంప్రదాయ రంగురంగుల వస్త్రాలు ధరించి రంగులద్దిన ముఖాలు కలిగిన గుర్రపు యోధులు.. గోప్, ఫుగ్డి వంటి జానపద నృత్యాలను ప్రదర్శిస్తారు. ప్రభుత్వం ఈ పండుగను పట్టణ ప్రాంతంలో కార్నివాల్ పరేడ్గా జరుపుకుంటుంది.
మహారాష్ట్రలో హోలీని రంగ్ పంచమి, షిమ్గా అని పిలుస్తారు. రాజ్గఢ్, రత్నగిరి, సింధుగఢ్లోని ఫాల్గుణ పూర్ణిమ తర్వాత ఐదు రోజుల తరువాత షిమ్గా పండుగ జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈ పండుగ సమయంలో దేవుడు తమ ఇంటికి వస్తారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఈ సమయంలో ప్రజలు పల్లకీలో కూర్చుని నృత్యం చేస్తారు. కుటుంబాల శ్రేయస్సు కోసం సమిష్టిగా ప్రార్థిస్తారు. సాంప్రదాయం ప్రకారం, ప్రజలు వేప, కుంకుమ, పసుపు, మూలికలతో చేసిన గులాల్, రంగు నీటిని చల్లుకుంటారు. అనేక గ్రామాల్లో ఇప్పటికీ దేవతల విగ్రహాలతో రంగురంగుల ఊరేగింపులు నిర్వహిస్తుంటారు.
ఉత్తరప్రదేశ్లోని బ్రజ్ ప్రాంతంలోని బర్సనా గ్రామంలో హోలీ మరో విధంగా ఆడతారు. దీనిని లఠ్మార్ హోలీ అంటారు. బ్రజ్లో శ్రీకృష్ణుడు, రాధ ప్రేమతో హోలీ కనిపిస్తుంది. ఇక్కడ నందగావ్ పురుషులు, బార్సనే మహిళలు హోలీలో పాల్గొంటారు. వాస్తవానికి కృష్ణుడు నందగావ్, రాధా బర్సనాకు చెందినవారు. పురుషుల్ని కర్రలతో కొట్టడం, వారు తమను తాము రక్షింకుంటూ తోటివారిని రక్షించడం ఈ పండుగ ముఖ్యోద్దేశంగా భావిస్తారు. ఈ పర్వదినం సందర్భంగా గులాల్ మొత్తం గ్రామంలో ఎగురుతుంది. ప్రతి ఒక్కరినీ రంగు నీటితో ముంచెత్తుతారు. బృందావనంలో హోలీ సందర్భంగా శ్రీకృష్ణుడితో హోలీ ఆడుతున్నట్లుగా భావిస్తూ మహిళలు రంగులు చల్లుతారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకచోట గుమిగూడి హోలీ రంగులు చల్లుకోవడం ప్రత్యేకత. ఈ ప్రత్యేకమైన పండుగకు విదేశాల నుంచి వందలాది మంది పర్యాటకులు వస్తుంటారు.
బసంత్ పంచమి తరువాత బిహార్లో హోలీ ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పాడే పాటలను ఫాగ్ అంటారు. బిహార్లోని పెద్ద ప్రాంతంలో వీటిని ఫగువా అని పిలుస్తారు. హోలి కా దహన్ మరుసటి రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ధూళి-మట్టి, రంగుతో హోలీని ఆడతారు. సాయంత్రం ప్రజలు ఒకరి ఇంటికి మరొకరు వెళ్లి ఫగువా పాడతారు. ఈ సమయంలో గ్రామాల్లో ఫగువా కోసం చౌపాల్స్ అలంకరిస్తారు.
అద్భుతమైన విజయాలకు మరో పేరు.. సైనా నెహ్వాల్