తిరుమల : శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరకు మలయప్పస్వామివారిని, శ్రీకృష్ణ స్వామివారిని ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఊరేగించి, కల్యాణమండపంలో ఆస్థానం నిర్వహించారు.
ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలు, హరికథ పారాయణం నిర్వహించారు. టీటీడీ గార్డెన్ విభాగం ఆధ్వర్యంలో అడవిలో ఉండే విధంగా పులులు ఇతర క్రూర జంతువుల సెట్టింగ్లు ఏర్పాటు చేశారు. ఆలయ అర్చకులు మూడుసార్లు స్వామి వారి తరఫున ఈటెను విసిరి పార్వేట ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, అధికారులు పాల్గొన్నారు.