నిజామాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారతీయ జనతా పార్టీ ఇందూర్ శాఖలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై పలువురు నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన పదాధికారుల సమావేశం రసాభాసగా మారింది. బీజేపీ నిజామాబాద్ జిల్లా మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు బస్వా లక్ష్మీనారాయణ సమక్షంలోనే అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. సమావేశం మొదలైన పది నిమిషాల్లోపే తీవ్ర గందరగోళం ఏర్పడింది. ‘ఆది నుంచి ఆరెస్సెస్ను నమ్ముకొని బీజేపీలో పనిచేస్తున్న మేమంతా పిచ్చోళ్లమా? మా పరిస్థితి ఏమిటి? జైళ్లు, కేసులు మాకు.. పదవులు, ఆర్భాటాలు మీకా?’ అంటూ బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు నిలదీశారు. దీంతో జిల్లా అధ్యక్షుడు కంగు తిన్నారు. బోధన్ నియోజకవర్గానికి చెందిన రామరాజు, గోపాల్, సంతోష్తోపాటు మరికొందరు మూకుమ్మడిగా లేచి పార్టీలో అసలు ఏం జరుగుతున్నదని నిలదీశారు. పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్లను పూర్తిగా పక్కన పెడుతున్నారంటూ ఒకరి తర్వాత మరొకరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా ముఖ్య నాయకులు నోరు మెదపలేదు. పదాధికారుల సమావేశం పక్కదారి పట్టడంతో హడావిడిగా కార్యక్రమాన్ని ముగించారు.
అర్వింద్ వల్లే ఇదంతా..
సమావేశంలో బోధన్ మండలానికి చెందిన ముఖ్య నాయకుడు రామరాజు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్టు తెలిసింది. ఎంపీ అర్వింద్ తీరు ఏమాత్రం బాగోలేదని ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎడపల్లి మండల నాయకుడు గోపాల్, నవీపేట మండలానికి చెందిన ప్రధాన నాయకుడు సంతోష్ సైతం ఎంపీ వల్లే పార్టీలో గ్రూపు రాజకీయాలు పెరిగాయని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. నిన్న కాక మొన్న బీజేపీలోకి వచ్చిన ఎంపీ అర్వింద్కు పాత నాయకుల ముఖాలే తెలియదని పలువురు నేతలు ఎద్దేవా చేశారు. కొత్త వారికే జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తూ పాతవారిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనారాయణ ఎదుటే విమర్శలు గుప్పించడం ప్రాధాన్యం సంతరించుకున్నది. వేరే పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చీరాగానే జిల్లా అధ్యక్ష పదవిలో బస్వా లక్ష్మీనారాయణను కూర్చోబెట్టడాన్ని పలువురు నాయకులు నిలదీశారు. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతల పరస్పర ఆరోపణల సమయంలో ముఖ్య నాయకులెవ్వరూ సమాధానం ఇచ్చేందుకు ముందుకు రాలేకపోయారు. బీజేపీ పదాధికారుల విమర్శలు ఎక్కడ తమ వైపు మళ్లుతాయేమోనని సైలెంట్గా కూర్చుండిపోయారు.
కార్పొరేటర్లు పార్టీ మారుతుంటే ఏం చేస్తున్నారు?
నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు వరుసగా టీఆర్ఎస్లో చేరుతున్నారు. మూడు నెలల్లో పలువురు బీజేపీ సీనియర్ లీడర్లు, కార్పొరేటర్లు గులాబీ కండువా కప్పుకున్నారు. కార్పొరేటర్లు మల్లేశ్యాదవ్, బైకాన్ సుధా, ఆకుల హేమలత తదితరులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మరోవైపు నగర బీజేపీ నాయకత్వంలో అసంతృప్తి పెరుగుతున్నది. పార్టీ మారుతున్న కార్పొరేటర్లు అందరూ ఎంపీ తీరునే తప్పుబట్టడంతో అర్వింద్ తీరుపై నగరానికి చెందిన నాయకులు పదాధికారుల సమావేశంలో ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికే 11 మంది కార్పొరేటర్లు బీజేపీని వీడి, టీఆర్ఎస్లో చేరడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటూ ప్రశ్నల వర్షం కురిపించగా, వేదికపై కూర్చున్నవారు మాట్లాడకుండా ఉండిపోయారు. అర్వింద్ వల్ల పార్టీ నాశనం అవుతున్నదని విమర్శలు చేసినట్టు బీజేపీ నేతలు చెప్తున్నారు.