Parliament Security Breach | పార్లమెంట్పై దాడి జరిగిన బుధవారానికి 22 సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా అదే రోజున మళ్లీ పార్లమెంట్లో భద్రతా లోపం చోటు చేసుకున్నది. పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు అగంతకులు చొరబడి విజిటర్స్ గ్యాలరీ నుంచి సమావేశం జరుగుతున్న సభలోకి చొరబడ్డారు. దీంతో ఒక్కసారిగా సభలో కలకలం సృష్టించింది. ఆ తర్వాత ఎంపీలు ఇద్దరు నిందితులను పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఆ తర్వాత సభా కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. ఈ ఘటనపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, సరిగ్గా ఇదే రోజున అంటే 2001 డిసెంబర్ 13న ఏం జరిగిందో గుర్తు చేసుకుందాం..!
ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంట్ భవనంలో నెత్తురుపారింది. పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడికి దిగారు. లష్కరే తోయిబా, జైషే మహ్మద్లకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంటు భవనంపై దాడి పాల్పడ్డారు. ఈ దాడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు ఢిల్లీ పోలీసులు, ఇద్దరు పార్లమెంట్ సెక్యూరిటీ సర్వీస్ సిబ్బంది, ఒక తోటమాలి ఉన్నారు. పార్లమెంట్పై దాడి చేసేందుకు వచ్చిన ఉగ్రవాదులు భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఎంపీలు సభలో ఉన్నారు. ఓ అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య గందరగోళం నెలకొన్నది. దీంతో ఉభయ సభలు 40 నిమిషాల పాటు వాయిదాపడ్డాయి. అయితే, ఇంతలోనే పార్లమెంట్ వెలుపల తుపాకులు పేలాయి. ఈ ఘటనే పార్లమెంట్నే కాదు.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
పార్లమెంట్పై ఉగ్రవాదులు దాడికి తెగబడగా.. భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల వాహనాన్ని ఆపేందుకు శాయశక్తులా ప్రయత్నించారు. గందరగోళ పడగా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపడ్డాయి. ఆ తర్వాత ఉదయం 11.29 గంటలకు అప్పటి ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ కృష్ణకాంత్ భద్రతా సిబ్బంది పార్లమెంట్ హౌస్లోని గేట్ నంబర్ 11 వద్ద బయటకు వచ్చే వరకు వేచి ఉన్నారు. అదే సమయంలో ఉపరాష్ట్రపతి కాన్వాయ్ వైపు తెల్లటి అంబాసిడర్ కారు వేగంగా రావడం కనిపించింది. పార్లమెంటుకు వచ్చే వాహనాల సాధారణ వేగం కంటే ఈ వాహనం వేగం చాలా ఎక్కువగా కనిపించింది. లోక్సభ కాంప్లెక్స్లోని సెక్యూరిటీ గార్డు జగదీష్ యాదవ్ ఈ వాహనం వెనుక నడుస్తున్నట్లు కనిపించాడు. వాహనం తనిఖీ కోసం ఆపమంటూ సిగ్నల్ ఇచ్చాడు.
ఉప రాష్ట్రపతి కోసం నిరీక్షిస్తున్న భద్రతా సిబ్బంది జగదీశ్ యాదవ్ పరుగెత్తుతుండం చూసి షాక్కు గురయ్యారు. వారు కూడా వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఇందులో ఇందులో ఏఎస్సై జీత్ రామ్, ఏఎస్సై నానక్ చంద్, ఏఎస్సై శ్యామ్ సింగ్ కూడా అంబాసిడర్ వైపు పరుగులు తీశారు. తన వైపు వేగంగా వస్తున్న సెక్యూరిటీ సిబ్బందిని చూసి, అంబాసిడర్ కారు డ్రైవర్ తన కారుని గేట్ నంబర్ వన్ వైపు తిప్పాడు. ఉపరాష్ట్రపతి కారు గేట్ నంబర్లు 1, 11 సమీపంలో పార్క్ చేసి ఉంది. అయితే కారు వేగంగా ఉండడం, మలుపు కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కారు నేరుగా ఉప రాష్ట్రపతి కారును ఢీకొట్టింది. ఆ తర్వాత పార్లమెంట్ ఆవరణలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఆ తర్వాత అంబాసిడర్ కారు నాలుగు డోర్లు ఒకేసారి తెరుచుకున్నాయి. అందులో నుంచి రెప్పపాటులో కారులో కూర్చున్న ఐదుగురు ఉగ్రవాదులు బయటకు వచ్చి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఐదుగురి చేతుల్లో ఏకే-47 తుపాకులు ఉన్నాయి. ఐదుగురికి వీపునకు బ్యాగులతో కనిపించారు. ఉగ్రవాదుల దాడిలో మొదట కారును ఆపేందుకు ప్రయత్నించిన నలుగురు భద్రతా సిబ్బంది తొలుత మృతి చెందారు. ఆ తర్వాత ఉగ్రవాదులు తుపాకులు కాల్పులు జరుపుతూ.. గ్రెనేడ్లను వదిలారు. దీంతో పార్లమెంట్లో ఒక్కసారిగా ఆందోళనకర పరిస్థితి నెలకొన్నది.
గేట్ నంబర్ 11 వైపు ఉగ్రవాదులను చూసిన ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది, పార్లమెంట్ హౌస్ సిబ్బందితో గేట్ నంబర్ 11 వైపు వెళ్లారు. ఆ తర్వాత ఉగ్రవాదులపై కాల్పులకు దిగారు. ఉగ్రవాదులు భవనంలోకి ప్రవేశించే అవకాశం ఉందని భావించిన భద్రతా సిబ్బంది అప్పటి హోం మంత్రి ఎల్కే అద్వానీ, రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్ సహా సీనియర్ మంత్రులను భవనంలోనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆ తర్వాత పార్లమెంట్ లోపలికి, బయటకు వచ్చే తలుపులన్నింటిని మూసివేశారు. అయితే, ఆ తర్వాత ఉగ్రవాదులు ఐదుగురు విడిపోయి ఒకరు ఒకటో నంబర్ గేట్ వైపు.. మిగతా నలుగురు 12 నంబర్ గేట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదులు సభలోకి ప్రవేశించేందుకు తలుపులను తెరిచేందుకు ప్రయత్నించారు. ఒకటో నెంబర్ గేట్ వైపుగా కదిలిన ఉగ్రవాది.. సభలోకి వెళ్లేందుకు పార్లమెంట్ హౌస్ కారిడార్ వైపు వెళ్లాడు. అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది సదరు ఉగ్రవాదిపై కాల్పులు జరిపారు. సదరు ఉగ్రవాదికి బుల్లెట్ల గాయాలయ్యాయి. ఆ తర్వాత ఉగ్రవాది రిమోట్ సహాయంతో తనను తాను పేల్చుకున్నాడు.
మిగతా నలుగురు ఉగ్రవాదులు అటూ ఇటూ తిరుగుతూ కాల్పులు జరిపారు. నలుగురు టెర్రరిస్టులు కాంప్లెక్స్లో అక్కడక్కడా తలదాచుకోవడానికి వెతుకుతూ పరుగెత్తుతున్నారు. మరోవైపు, భద్రతా సిబ్బంది ఇప్పుడు అన్ని వైపుల నుంచి ఉగ్రవాదులను చుట్టుముట్టారు. ఐదో నెంబర్ గేట్ వద్ద మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇంకా ముగ్గురు ఉగ్రవాదులు బతికే ఉన్నారు. తాము పార్లమెంట్ నుంచి తప్పించుకోలేమని భావించిన ఉగ్రవాదులు చివరగా హౌస్లోకి ప్రశ్నించేందుకు ఆఖరి ప్రయత్నంగా తుపాకులతో కాల్పులు జరుపుతూ 9 నెంబర్ గేట్ వైపు వెళ్లారు. భద్రతా సిబ్బంది తొమ్మిదో నంబర్ గేట్ దగ్గర ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది చుట్టుముట్టారు. అక్కడే ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చాయి. మొత్తం ఆపరేషన్ను 40 నిమిషాల్లోనే బలగాలు ముగించాయి.