కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. నదియా జిల్లాకు చెందిన 14 ఏండ్ల బాలికపై స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కుమారుడు లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు చాలా కుంగిపోయారు. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. బాధిత బాలిక తల్లి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నదని స్థానికులు తెలిపారు. ఆమె తండ్రి కూడా డీహైడ్రేషన్ వల్ల అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం వారిద్దరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ నెల 5న స్థానిక పంచాయతీ టీఎంసీ నేత సమర్ గోలా కుమారుడు, 21 ఏండ్ల బ్రజ్ గోపాల్ గోలా పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన బాలికపై లైంగికదాడి జరిగింది. ఆ మరునాడు ఆమె మరణించింది. అయితే టీఎంసీ నేత ఒత్తిడి వల్ల తమ కుమార్తె మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు నిర్వహించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తన కుమార్తె, టీఎంసీ కుమారుడి మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న బాలిక తండ్రి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఈ నెల 10న పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు బెంగాల్లో సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు కోల్కతా హైకోర్డు మంగళవారం అప్పగించింది. బాధిత బాలిక కుటుంబానికి, సాక్షులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యంపై చీవాట్లు పెట్టింది.