న్యూఢిల్లీ, మే 11: ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్లు, పోస్టాఫీసుల నుంచి రూ. 20 లక్షలకు మించి డిపాజిట్ చేసినా, విత్డ్రా చేసినా పాన్ లేదా ఆధార్ను తప్పనిసరిగా కోట్ చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. అలాగే బ్యాంక్ల వద్ద కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా ప్రారంభించేందుకు కూడా వీటిని కోట్ చేయడం తప్పనిసరి చేశారు. ఈ మేరకు తాజాగా సీబీడీటీ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనలు 2022 మే 26 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
కొత్త నిబంధనల పర్యావసానాలను కన్సల్టెన్సీ సంస్థ ఎకనామిక్ లా ప్రాక్టీస్ పార్టనర్ రాహుల్ చక్ర వివరిస్తూ ఇప్పటివరకూ ఆయా లావాదేవీలు జరిపే వ్యక్తికి పాన్ నంబరు ఉందా లేదా అనేది మాత్రమే బ్యాంక్ అధికారి చూడాల్సి వచ్చేందని, ఇక నుంచి బ్యాంక్ రికార్డుల్లో ఆ పాన్ను బ్యాంక్ అధికారి అట్టిపెట్టి, ఆదాయపు పన్ను శాఖకు ఆర్థిక లావాదేవీల వివరాల్ని తెలియపర్చాల్సి ఉంటుందని చెప్పారు.
అలాగే కొత్త నిబంధనలు బ్యాంక్లకు మాత్రమే కాకుండా, పోస్టాఫీసులు, సహకార సంఘాలకు సైతం వర్తిస్తాయన్నారు. ఆర్థిక వ్యవస్థలో నగదు చెలామణీని అదుపుచేసి, నగదు డిపాజిట్లు/విత్డ్రాయిల్స్ను ట్రాక్ చేసే దిశగా కొత్త నిబందనల్ని తీసుకొచ్చిందని తెలిపారు. పాన్ లేదా ఆధార్ను కోట్ చేయడంతో ఆయా లావాదేవీలకు టీడీఎస్ వర్తించినా, లేకపోయినా అటువంటి వ్యక్తుల ఆర్థిక లావాదేవీలను ఐటీ శాఖ ట్రాక్ చేయగలుగుతుందని వివరించారు.
ఇప్పటికే రూల్ 114బీ ప్రకారం ఒక రోజులో రూ. 50,000కు మించి నగదు డిపాజిట్ చేస్తే పాన్ తప్పనిసరిగా ఉందని, అయితే వార్షిక పరిమితి లేదని, ఇప్పుడా పరిమితిని విధించారని టీఆర్ ఛాధా అండ్ కో పార్టనర్ ఆకాంక్ష గోయల్ తెలిపారు. కొత్త నిబంధనల కారణంగా అటువంటి లావాదేవీలు జరిపే ప్రతీ ఒక్కరూ పాన్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ రూల్స్ మే 26 నుంచి అమలులోకి రానున్నందున, ఆ లోపు జరిగిన లావాదేవీలను కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రూ. 20 లక్షల పరిమితిలో కలుపుతారా లేదా అన్నది సీబీడీటీ వివరణ ఇవ్వాల్సి ఉన్నదని ఆమె అన్నారు.