PAN-Aadhaar | గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక లావాదేవీలకు, ఐటీఆర్ దాఖలు చేయడానికి ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ చేయడం తప్పనిసరి. ఇప్పటికే పలుసార్లు ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి ఆదాయం పన్ను విభాగం గడువులు విధించింది. తాజాగా, వచ్చే నెలాఖరులోగా ఆధార్-పాన్ కార్డు అనుసంధానమైతే టీడీఎస్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయం పన్ను విభాగం స్పష్టం చేసింది.
అయితే, ఆదాయం పన్ను విభాగం నిబంధనల ప్రకారం బయో మెట్రిక్ ఆధార్తో పాన్ కార్డును అనుసంధానించక పోతే సాధారణంగా వర్తించే టీడీఎస్కు రెండింతలు ఎక్కువ డిడక్షన్ జరుగుతుందని ఈ నెల 24న జారీ చేసిన సర్క్యులర్లో కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తెలిపింది. పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ గా ఉన్న పన్ను చెల్లింపుదారులు జరిపే లావాదేవీల సమయంలో టీడీఎస్ / టీసీఎస్ కలెక్షన్ ఎగవేతకు పాల్పడుతున్నారని నోటీసులు వస్తున్నాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఈ మేరకు తమకు పన్ను చెల్లింపుదారుల నుంచి ఫిర్యాదులు అందాయని వివరించింది.
2022 జూన్ 30 వరకు ఫ్రీగానే పాన్-ఆధార్ అనుసంధానం జరిగింది. 2022 జూలై ఒకటో తేదీ నుంచి 2023 జూన్ 30 వరకూ రూ.1000 ఆలస్య రుసుముతో ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి అనుమతించారు. తర్వాత అనుసంధానించని పాన్ కార్డులు ఇన్ ఆపరేటివ్గా మారాయి. ఇప్పుడు ఎవరైనా ఆధార్-పాన్ కార్డు అనుసంధానించుకోవాలంటే ముందు రూ.1000 ఫైన్ పే చేయాలి. అలా మనీ చెల్లించిన తర్వాత పాన్ కార్డ్ ఆపరేటివ్ లోకి రావడానికి 30 రోజులు పడుతుంది. ఆధార్-పాన్ కార్డు అనుసంధానించకుంటే ఐటీ రిఫండ్స్ ఉండవని, తర్వాత రీఫండ్ అయినా, ఆలస్యమైన సమయానికి వడ్డీ చెల్లించబోమని ఆదాయం పన్ను విభాగం తెలిపింది. అయితే, 2024 మార్చి 31 వరకూ జరిగిన ఆర్థిక లావాదేవీలపై సాధారణ రేటు టీడీఎస్ లేదా టీసీఎస్ వసూలు చేస్తామని సీబీడీటీ వివరించింది.