పాకిస్తాన్ మహిళలు చరిత్ర సృష్టించారు. 12 ఏళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచకప్లో తొలి విజయం నమోదు చేశారు. వెస్టిండీస్తో జరిగిన మహిళల ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్ ముందు వరకు ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్ వరుసగా 18 మ్యాచుల్లో ఓటమి పాలైంది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో తొలుత వెస్టిండీస్ బ్యాటింగ్ చేసింది.
పాక్ స్పిన్నర్ నిదార్ దాస్ కేవలం పది పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడంతో విండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. ఆమెతోపాటు ఫాతిమా సనా, నష్రా సందు, ఒమైమా సొహైల్ తలో వికెట్ తీసుకున్నారు. వీళ్లంతా పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి విండీజ్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 89 పరుగులు మాత్రమే చేయగలిగింది. 90 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్కు కూడా ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది.
ఓపెనర్ సిద్రా అమీన్ (8) స్వల్పస్కోరుకే వెనుతిరిగింది. అయితే మరో ఓపెనర్ మునీబ్ అలీ (37)తో జత కట్టిన కెప్టెన్ బిస్మా మరూఫ్ (20 నాటౌట్) జట్టును ముందుకు నడిపించింది. చివరకు ఒమైమా సొహైల్ (22 నాటౌట్)తో కలిసి జట్టుకు విజయాన్నందించింది. పాక్ జట్టు మరో ఏడు బంతులు మిగిలుండగానే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేందించింది. 2009 తర్వాత ప్రపంచకప్ పోటీల్లో పాక్కు ఇదే తొలి విజయం కావడంతో ఆ జట్టు సంబరాల్లో మునిగిపోయింది.