మెదక్, మే 7: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల కారణంగా గ్రామైక్య సంఘాలకు ధాన్యం కొనుగోలు సమయంలో ఉపాధి లభించడంతో పాటు కమీషన్ అందుతున్నది. రైతులు పండించిన ధాన్యం దళారులకు విక్రయించి నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని పీఏసీఎస్, ఐకేపీ, మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. వడ్లు కొనుగోలు చేసిన సంఘాలకు క్వింటాల్ ధాన్యానికి రూ.32 కమీషన్ ప్రభుత్వం అందిస్తున్నది. రైతులు వానకాలం, యాసంగి సీజన్లలో పండించిన ధాన్యాన్ని ఏటా కొనుగోలు చేస్తున్నారు. గత సంవత్సరం కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన కమీషన్ రూ.27.49 కోట్లు ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది.
నాలుగు సీజన్ల బిల్లులు విడుదల..
2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు వానకాలం, యాసంగి సీజన్లల్లో కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన కమీషన్ ఖాతాల్లో జమ చేసినట్లు డీఎస్వో శ్రీనివాస్ తెలిపారు. 2019-20 వానకాలం సీజన్లో మెదక్ జిల్లాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 150 కేంద్రాలు, ఐకేపీ ద్వారా 31 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 181 కేంద్రాల్లో 2 లక్షల 70వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు చేసిన సంఘాలకు కమీషన్ డబ్బులు రూ.6 కోట్ల 62 లక్షల 70వేల 938లను అందజేశారు. అలాగే, 2019-20 యాసంగి సీజన్లో మొత్తం 201 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 174, ఐకేపీ ఆధ్వర్యంలో 27 కేంద్రాల ద్వారా 1.77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇందుకు గానూ రూ.5 కోట్ల 69లక్షలను ఆయా సంఘాలకు అందజేశారు.
2020-21 వానకాలంలో 322 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 210, ఐకేపీ ఆధ్వర్యంలో 108, మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నాలుగు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయగా, 2.55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి రూ.8 కోట్ల 17 లక్షల 32వేలు కమీషన్ రూపంలో రావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.5 కోట్ల 27 లక్షలు వచ్చాయి, ఇంకా రూ.2 కోట్ల 90 లక్షలు రావాల్సి ఉంది. 2020-21 యాసంగిలో 326 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో 221, ఐకేపీ ఆధ్వర్యంలో 102, ఏఎంసీ ద్వారా 3 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.9.90 కోట్లను సంబంధిత శాఖల ఖాతాల్లో జమ అయినట్లు అధికారులు తెలిపారు.
క్వింటాలుకు రూ.32 చొప్పున కమీషన్..
క్వింటాలుకు రూ.32 చొప్పున కమీషన్ను పౌరసరఫరాల శాఖ చెల్లిస్తున్నది. నాలుగు సీజన్లల్లో కొన్న ధాన్యానికి ఆయా సంఘాలకు రూ.27.49 కోట్ల కమీషన్ విడుదలైంది. దీంతో ఆయా సంఘాల సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కమీషన్ డబ్బులు విడుదల
2019-20 వానకాలం సీజన్లో రూ.6కోట్ల 62 లక్షల 70వేలు, 2019-20 యాసంగి సీజన్లో రూ.5 కోట్ల 69లక్షలను, 2020-21 వానకాలంలో రూ.8 కోట్ల 17 లక్షల 32వేలు, 2020-21 యాసంగిలో రూ.9.90 కోట్లు విడుదలయ్యాయి. వరి ధాన్యం కొనుగోలు చేసిన పీఏసీఎస్, ఐకేపీ, మార్కెట్ కమిటీల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.
– శ్రీనివాస్, డీఎస్వో మెదక్