టెహ్రాన్: ఇరాన్లోని పశ్చిమ అజర్బైజాన్ సిటీలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం 528 మందిని గాయాలపాలు చేసింది. వారిలో 135 మందికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రుల్లో చేర్పించారు. మిగతా వారిని ప్రథమ చికిత్సలు చేసి పంపించారు.
భూకంప ప్రాంతంలో మొత్తం 500 ఇండ్లు ధ్వంసమయ్యాయి. అందులో 450 ఇండ్లు పాక్షికంగా దెబ్బతినగా, 50 ఇండ్లు పూర్తిగా కుప్పకూలాయి. మొత్తం 12 గ్రామాలపై ఈ భూకంపం ప్రభావం చూపించింది. కరెంటు స్తంభాలు విరిగి, పైప్లైన్లు పగిలిపోవడంతో ఆ 12 గ్రామాలకు విద్యుత్, తాగునీటి సరఫరా నిలిచిపోయింది. బాధితులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి భోజనం, వైద్య వసతులు కల్పించారు.
ఇరాన్లో గతంలో రెండు భారీ భూకంపాలు విధ్వంసం సృష్టించాయి. 1990లో 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం 40 వేల మందిని బలితీసుకున్నది. 3,00,000 మందికి గాయాలయ్యాయి. సుమారు ఐదు లక్షల మంది ఆవాసాలు కోల్పోయారు. 2003లో బామ్ నగరంలో 6.6 తీవ్రతతో సంభవించిన మరో భూకంపం 31 వేల మందిని పొట్టనబెట్టుకుంది.