న్యూఢిల్లీ, నవంబర్ 29: గడిచిన ఐదున్నరేండ్లకుపైగా కాలంలో దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతబడ్డాయి. 2016 ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా దేశంలో మొత్తం 5,00,506 కంపెనీలు బందైనట్లు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ), కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ర్టాలవారీగా మూతబడ్డ సంస్థలు ఎన్ని? అంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు సోమవారం లోక్సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
రాష్ర్టాలవారీగా ఎన్ని మూతబడ్డాయన్న వివరాలు లేవన్న మంత్రి.. దాదాపు గడిచిన ఆరేండ్లలో అత్యధికంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో 2,36,262 సంస్థలు మూతబడినట్లు తెలిపారు. 2018-19లో 1,43,233 సంస్థలు క్లోజైనట్లు చెప్పారు. 2016-17లో 12,808, 2019-20లో 70,972, 2020-21లో 14,674 సంస్థలు బందైయ్యాయి. ఇక ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఇప్పటిదాకా 22,557 సంస్థలు డీరిజిస్టర్ అయినట్లు వెల్లడించారు. ఇదిలావుంటే గడిచిన ఐదున్నరేండ్లకుపైగా కాలంలో 2013 కంపెనీ చట్టం కింద దేశంలో కొత్తగా 7,17,049 సంస్థలు నమోదైనట్లు మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 1,09,098 కొత్త సంస్థలు వచ్చినట్లు చెప్పారు.
46వేల కోట్ల ఎన్పీఏలు రద్దు
బ్యాలెన్స్ షీట్ల బరువును తగ్గించుకోవడానికి కార్పొరేట్ల మొండి బకాయిల (నిరర్థక ఆస్తులు లేదా ఎన్పీఏ)ను బ్యాంకులు ఏటా రద్దు చేస్తూనే ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్లోనూ రూ.46,382 కోట్ల ఎన్పీఏలను బ్యాంకులు రద్దు చేసినట్లు లోక్సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరద్ తెలిపారు. నిరంతరం సాగే ప్రక్రియలో భాగంగానే కార్పొరేట్ల మొండి బకాయిల రద్దు జరుగుతున్నట్లు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కాగా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల రుణ బకాయిలు ఈ ఏడాది మార్చి ఆఖరు నాటికి రూ.3,34,171 కోట్లుగా ఉన్నాయని కరద్ ఈ సందర్భంగా తెలిపారు. నిరుడు మార్చి చివరి నాటికి రూ.2,98,214 కోట్లుగా ఉన్నాయి. ఇదిలావుంటే ఈ నెల 23 నాటికి నికర ప్రత్యక్ష పన్ను ఆదాయం 68 శాతం పెరిగి రూ.6.92 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి చెప్పారు.
రాష్ర్టాలకు 52 వేల కోట్ల జీఎస్టీ పరిహారం పెండింగ్
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రాష్ర్టాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారంలో ఇంకా రూ.52 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని కేంద్రప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. లోక్సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి ఈ మేరకు సమాధానం ఇచ్చారు. రాష్ర్టాలకు 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1.10 లక్షల కోట్లు, 2021-22లో రూ.1.59 లక్షల కోట్ల పరిహారం చెల్లించినట్టు తెలిపారు. పరిహారం పెండింగ్ ఉన్న రాష్ర్టాల్లో మహారాష్ట్రకు రూ.13,153 కోట్లు, ఉత్తరప్రదేశ్కు రూ.5,441 కోట్లు, తమిళనాడుకు రూ.4,943 కోట్లు, ఢిల్లీకి రూ. 4,647 కోట్లు, కర్ణాటకకు రూ.3,528 కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పారు. అరుణాచల్ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్లకు ఎలాంటి పరిహారం పెండింగ్లో లేదని పేర్కొన్నారు.