Pakistani terrorists : జమ్మూ ఏరియా (Jammu Area) లో 30 మందికి పైగా పాకిస్థానీ ఉగ్రవాదులు (Pak terrorists) నక్కినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. దాంతో భద్రతా బలగాలు (Security forces) అప్రమత్తమయ్యాయి. ఉగ్ర స్థావరాలు గుర్తించడానికి కొండలు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమేజర్లు, గ్రౌండ్ సెన్సార్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదులపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతాల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు జమ్మూ కశ్మీర్లో మంచు కురుస్తుండటంతో చొరబాట్లకు ఇదే అదునుగా భావించిన ఉగ్రమూకలు అంతర్జాతీయ సరిహద్దును దాటుకుని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ విషయాన్ని సరిహద్దు భద్రతా దళం అధికారులు వెల్లడించారు. అయితే ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను తమ దళాలు తిప్పికొడుతున్నాయని అన్నారు. సరిహద్దుల్లో ఉగ్ర కదలికల నేపథ్యంలో కశ్మీర్లోని గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ లేక్ ప్రాంతాలతో సహా పలు సున్నితమైన ప్రదేశాల్లో భద్రతా దళాలు, స్థానిక పోలీసులు ప్రత్యేక బృందాలను మోహరించినట్లు తెలిపారు.