హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో తుది విడత సీట్ల కేటాయింపు శుక్రవారం పూర్తయింది. రెండు వితల్లో నిర్వహించిన కేటాయింపుల్లో 75 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మూడు యూనివర్సిటీ కాలేజీలు, 12 ప్రైవేట్ కాలేజీల్లో వందశాతం సీట్లు నిండగా, ఒక ప్రైవేట్ కాలేజీలో అసలు ఎవరూ చేరలేదు. సీఎస్ఈ, ఐటీ విభాగం కోర్సులకు విశేష స్పందన కనిపించింది. ఇంకా 24,002 సీట్లు ఖాళీ ఉన్నాయి.
వీటిని స్పెషల్ రౌండ్తో పాటు, స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీచేయనున్నారు. సీఎస్ఈ, అనుబంధ కోర్సుల్లో 4,455 సీట్లు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగంలో మొత్తం 7,141 సీట్లు, సివిల్, మెకానికల్ విభాగాల్లో 7,767 సీట్లు మిగిలాయి. మైనింగ్, టెక్స్టైల్, ఫార్మాస్యూటికల్ వంటి ఇతర కోర్సుల్లో 435 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఫార్మా కోర్సుల్లో ఎంపీసీ అభ్యర్థుల కోటాకు స్పందన కరువయ్యింది. రెండు విడతల కౌన్సిలింగ్లోనూ సీట్లు పూర్తిగా నిండలేదు. రెండో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా ఫీజు చెల్లించాలి. 18లోపు సీటును రద్దు చేసుకొనే అవకాశం ఉంది. 16వ తేదీలోగా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.