వ్యవసాయ యూనివర్సిటీ, జూలై 4: రై తులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే తమ లక్ష్యమని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఏయూ) వీసీ అల్దాస్ జానయ్య చెప్పారు. దేశంలో నాణ్యమైన విత్తనాలు అందించే సంస్థల్లో పీజేటీఏయూ ఒకటని తెలిపారు. శనివారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వీసీ మాట్లాడుతూ ఇక నుంచి నాణ్యమైన చిరుధాన్యాల విత్తనాలు రైతులకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. దేశంలో దాదాపు 800 రకాల వరి వంగడాలు ఉన్నప్పటికీ, పీజేటీఏయూ విడుదల చేసిన రకాలకు అధిక డిమాండ్ ఉన్నదని పేర్కొన్నారు. ఆరు వరి సన్నరకాలు, కంది, పెసర, మినుము, సోయాబీన్, మొక్కజొన్న, పత్తిలో పలు రకాల విత్తనాలను విడుదల చేశారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.