న్యూఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. ఇప్పటి వరకు 21 కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. శనివారం నాటికి వ్యాక్సినేషన్ డ్రైవ్ 134వ రోజుకు చేరగా.. ఒకే రోజు 28,09,436 టీకాలు వేసినట్లు పేర్కొంది. ఇందులో 25,11,052 మంది లబ్ధిదారులకు మొదటి, మరో 2,98,384 మంది లబ్ధిదారులకు రెండో మోతాదు అందజేసినట్లు చెప్పింది. 18-44 సంవత్సరాల మధ్య వయస్సున్న 14,15,190 మందికి మొదటి మోతాదు, మరో 9,075 మందికి రెండో మోతాదు అందజేసినట్లు తెలిపింది.
మూడో దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైన నుంచి దేశవ్యాప్తంగా 1,82,25,509 మందికి మొదటి మోతాదు అందిందని చెప్పింది. బిహార్, ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో 18-44 వయస్సున్న వారికి పదిలక్షలకుపైగా వ్యాక్సిన్లు వేసినట్లు పేర్కొంది. సాయంత్రం 7 గంటల వరకు అందిన తాత్కాలిక సమాచారం మేరకు దేశంలో మొత్తం 21,18,39,768 మోతాదులు అందించినట్లు చెప్పింది.