నటిగా తనకెంత పేరొచ్చినా స్నేహితులకు మాత్రం ఇష్టసఖినే అంటున్నది నాయిక రష్మిక మందన్న. వాళ్లతో తనకున్న స్నేహబంధం ఏమాత్రం మారలేదని ఆమె చెబుతున్నది. బాలీవుడ్ సహా తెలుగులో వరుస చిత్రాలతో తీరిక లేని రష్మిక వీలు చేసుకుని తన బాల్య స్నేహితురాలు రాగిని వివాహానికి హాజరైంది. ఈ పెళ్లి వేడుకలో ఆకర్షణగా మారిన రష్మిక..ఫ్రెండ్స్తో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేసింది.
ఇన్నాళ్లకు తిరిగి తన స్నేహితులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపింది. రష్మిక స్పందిస్తూ…‘మీకు నేను ఒక నాయికగా పరిచయం కాకముందు ఇలాగే ఉండేదాన్ని. వీళ్లంతా నా బాల్య స్నేహితులు. 17 ఏళ్ల స్నేహం మాది. కలిసే మేమంతా పెరిగాం. మా స్నేహం విషయంలో అప్పటికి ఇప్పటికీ ఏమార్పూ లేదు’ అని పేర్కొంది. రష్మిక నట ప్రయాణం తీరిక లేకుండా సాగుతున్నది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను, ‘గుడ్బై’, ‘యానిమల్’, తెలుగులో ‘పుష్ప 2’, ‘సీతా రామం’, విజయ్ 66 చిత్రాల్లో నటిస్తున్నది.