ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 14 : విద్యార్థులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ సూచించారు. ఓయూ టెక్నాలజీ కళాశాలలో ‘ఎమర్జింగ్ అండ్ అడాప్టబుల్ టెక్నాలజీస్ ఇన్ ప్రాసెస్ ఇండస్ట్రీస్’పై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. కళాశాలలోని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ సెల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీర్స్ – హైదరాబాద్ రీజనల్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ప్రారంభోత్సవాన్ని కళాశాల ఆడిటోరియంలో మంగళవారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ రవీందర్ మాట్లాడుతూ తాను వీసీగా నియామకమైన వెంటనే రిఫార్మ్-ట్రాన్స్ఫార్మ్-పర్ఫార్మ్ అనే నినాదంతో ఓయూ పునర్వైభవం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. ఫెస్టివల్ ఆఫ్ ఐడియాస్, స్టూడెంట్ కోఆర్డినేటర్స్, ఇన్నోవేటివ్ ఇంక్యుబేషన్ సెంటర్ వంటి వాటివల్ల మంచి ఫలితాలు వస్తాయన్నారు.
ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఓపెన్ డే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. టీచింగ్, లెర్నింగ్, రీసెర్చ్ అనే విధానం ద్వారా మార్కెట్కు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రారంభిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. టెక్నాలజీ కళాశాలలో బీఫార్మసీ, హోటల్ మేనేజ్మెంట్ వంటి కొత్త కోర్సులను ప్రారంభించాలన్నారు. సదస్సు చైర్మన్, టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి. వి. బసవరావు మాట్లాడుతూ ఈ సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఐఐసీటీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్. వెంకటమోహన్, సీఎస్ఐఆర్-ఎఫ్టీఆర్ఐ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎస్వీఎస్ విజయేంద్ర కీలకోపన్యాసం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల మాజీ ప్రిన్సిపాల్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ చింత సాయిలు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ప్రభాకర్రెడ్డి, సదస్సు కన్వీనర్ డాక్టర్ టి. జ్యోతి, టెక్నాలజీ ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ కవితా వాఘ్రే, టెక్స్టైల్ టెక్నాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ హయవదన, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ శ్రీనునాయక్, ఎవాల్యుయేషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజం, డాక్టర్ పరశురాం, కోఆర్డినేటర్లు డాక్టర్ పరమేశ్వర్లు, అయోధ్య కవిత, కోదండరామిరెడ్డి, డాక్టర్ అనిత, ప్రవీణ, ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.