సుల్తాన్బజార్, జూలై 7: దేశీయ వైద్యరంగంలో ఉస్మానియా దవాఖాన సరికొత్త చరిత్ర సృష్టించింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న ఓ ఇంజినీర్కు ఇటీవల అత్యంత క్లిష్టమైన 5 అవయవాల మార్పిడీ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి సత్తా చాటింది. ఇది యావత్తు తెలంగాణకే గర్వకారణమని రాష్ట్ర వైద్యవిద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ నరేందర్ కుమార్ పేర్కొన్నారు.
ఏకంగా 36 గంటలపాటు శ్రమించి ఈ శస్త్రచికిత్స నిర్వహించిన సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం హెచ్వోడీ డాక్టర్ మధుసూదన్, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాధిపతి డాక్టర్ బీ రమేశ్ కుమార్, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ ఆర్ పాండునాయక్, యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ మల్లికార్జున్, నెఫ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ మనీషా సహాయ్, పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ నాగార్జునచారి, రేడియాలజీ బృందాలతోపాటు డాక్టర్ మాధవి, పీజీలు, స్టాఫ్ నర్సులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆపరేషన్ థియేటర్ టీమ్ సిబ్బందిని మంగళవారం సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం డాక్టర్స్ డే సందర్భంగా టీజీడీఏ వ్యవస్థాపక ప్రతినిధులు ప్రొఫెసర్ పల్లం ప్రవీణ్, డాక్టర్ బొంగు రమేశ్, డీవీఎల్ విభాగాధిపతి డాక్టర్ భూమేశ్ కుమార్, ఉస్మానియా ఆర్ఎంవో మహమ్మద్ రఫీని ఘనంగా సన్మానించారు. ఉస్మానియా మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో అకడమిక్ డీఎంఈ డాక్టర్ రమాదేవి, ఓఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్, ఉస్మానియా మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ శంకర్ వెంకటేశ్ పాల్గొన్నారు.