
పెట్టుబడి పెట్టనున్న ఆప్టిమస్ ఫార్మా
హైదరాబాద్, డిసెంబర్ 30: హైదరాబాద్కు చెందిన ఆప్టిమస్ఫార్మా..మార్కెట్లోకి కరోనా వైరస్ను నియంత్రించే మోల్నుపిరవిర్ 200 ఎంజీ కాప్యూల్స్ను విడుదల చేసింది. ఈ సందర్భంగా కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా రంగం ఇటీవల కాలంలో భారీ వృద్ధిని నమోదు చేసుకుంటున్నదని, వచ్చే ఐదేండ్లలో వ్యాపార విస్తరణకోసం రూ.1,500 కోట్ల వరకు పెట్టుబడి పెడతామన్నారు. దీంట్లో ఏటా రూ.200-300 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ నిధులను వ్యాపార విస్తరణకోసం, హైదరాబాద్లో ఉన్న మూడు ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడానికి, ఇతర సంస్థలను కొనుగోలు చేయడానికి వెచ్చించనున్నట్టు చెప్పారు. ఈ నిధులను అంతర్గత వనరుల ద్వారా, బ్యాంకుల వద్ద రుణం తీసుకోనున్నట్టు ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.1,200 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఏటా 15-20 శాతం వరకు వృద్ధిని నమోదు చేసుకుంటున్నదన్నారు. వచ్చే మూడేండ్లలో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశాలున్నాయన్న శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. అయితే ఎంత మేర నిధులు సేకరిస్తామన్న వివరాలు వెల్లడించలేదు.
మార్కెట్లోకి మోల్నుపిరవిర్ కాప్యూల్స్
కొవిడ్-19 నిరోధక ఔషధమైన మోల్నుపిరవిర్ కాప్యూల్స్ను మార్కెట్లోకి విడుదల చేసింది ఆప్టిమస్ ఫార్మా. అత్యవసర వినియోగానికి ఇప్పటికే ఈ ఔషధానికి డీసీజీఐ నుంచి అనుమతి పొందినట్లు వెల్లడించింది. ఈ ఔషధంపై ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్ నిర్వహించి విజయవంతమైనట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఒక్కో కాప్యూల్ ధరను రూ.63గా నిర్ణయించింది. 10 కాప్యూల్స్ ధర రూ.630.