న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. సంక్షిప్తంగా సీబీఐ.. దేశంలో అత్యంత తీవ్రమైన నేరాలను దర్యాప్తు చేయాల్సిన జాతీయ సంస్థ ఇది. కానీ, దీని చుట్టూ నిత్యం వివాదాలే.. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీకి అనుగుణంగా పనిచేస్తుందనే విమర్శలు కోకొల్లలు. ఈ సంస్థ పని తీరు కూడా ఆ విమర్శలకు బలం చేకూర్చేలాగే ఉంటుంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న విమర్శలు ఎదుర్కొన్నది. నేడు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే పాలనలో ఏకంగా బీజేపీకి అల్లుడిగా మారిందనే విమర్శలు ఎదుర్కొంటున్నది. గత 18 ఏండ్లలో రాజకీయ నాయకులపై సీబీఐ దర్యాప్తు ఎలా కొనసాగిందన్నదానిపై ఇండియన్ ఎక్స్ప్రెస్ నిర్వహించిన పరిశోధనలో పలు సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
95 శాతం విపక్ష నేతలే టార్గెట్
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని వ్యతిరేకించే విపక్ష నేతలనే సీబీఐ టార్గెట్ చేస్తుందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాస్తవం కూడా అలాగే ఉన్నది. యూపీఏ పాలనలో సీబీఐ బారిన పడ్డ విపక్ష నేతలు 60 శాతం ఉండగా, ఎన్డీయే పాలనలో సీబీఐ టార్గెట్ చేసినవారిలో ఏకంగా 95 శాతం ప్రతిపక్ష నేతలే ఉన్నారని తేలింది. 2004-14 మధ్య పదేండ్ల యూపీఏ పాలనలో సీబీఐ 72 మంది ప్రముఖ రాజకీయ నాయకుల నేరాలపై దర్యాప్తు నిర్వహించగా, వారిలో 43 మంది విపక్ష నేతలున్నారు. అదే ఎన్డీయే-2 పాలనలో 2014 నుంచి నేటి వరకు సీబీఐ 124 మంది రాజకీయ నాయకులపై దర్యాప్తు నిర్వహించగా, వారిలో ఏకంగా 118 మంది విపక్ష నేతలే ఉండటం గమనార్హం.
పార్టీ మారితే కేసు మాఫీ
యూపీఏ హయాంలో అయినా, ఎన్డీఏ హయాంలో అయినా సీబీఐ కేసుల దర్యాప్తులో ఒక కామన్ అంశం వెలుగులోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ కేసులు ఎదుర్కొన్నవారు.. ఆ తర్వాత పార్టీ మారి అధికార పార్టీలో చేరితే చాలు.. వారిపై కేసులు మాయమైనట్టే. పార్టీ మారినవారిపై కేసులు వెంటనే పడకేస్తాయి. నేరారోపణల్లో తీవ్రత తగ్గిపోతుంది. చివరకు నిర్దోషులుగా బయటకు వస్తారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ విభేదాలతో డీఎంకే అందులోంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత మూడు రోజులకే లగ్జరీ కార్ల దిగుమతి కుంభకోణంలో నేటి తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. నిజానికి అప్పటికి నెల రోజుల ముందే, అంటే యూపీఏ నుంచి డీఎంకే బయటకు రావటానికి నెల రోజుల ముందే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను సీబీఐకి అందజేసింది. అయినా సీబీఐలో చలనం రాలేదు. ఎప్పుడైతే యూపీఏ నుంచి డీఎంకే బయటకు వచ్చిందో.. ఆ వెంటనే దాడులు మొదలుపెట్టింది.
పెరిగిన రాజకీయ వేధింపులు
యూపీఏ పాలనలో సీబీఐ దర్యాప్తు ఎదుర్కొన్న రాజకీయ నాయకుల్లో విపక్ష నేతలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అధికార పార్టీ నేతలు కూడా అధికంగా ఉన్నారు. 72 మంది నేతల్లో 29 మంది కాంగ్రెస్, యూపీఏ మిత్రపక్షాల నేతలు ఉన్నారు. కానీ, ఏన్డీయే పాలనలో సీబీఐ పూర్తిగా ప్రతిపక్ష నేతలనే టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నది. 2014 నుంచి సీబీఐ దర్యాప్తు ఎదుర్కొన్న 124 మంది రాజకీయ నాయకుల్లో 118 మంది విపక్ష నేతలు, వారి బంధువులే ఉన్నారు. దీనిపై ఇండియన్ ఎక్స్ప్రెస్ సీబీఐ వివరణ కోరగా ఎవరూ స్పందించలేదు.
నాడు ముద్దాయి.. నేడు హోంమంత్రి
యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు పలువురు ప్రతిపక్ష కీలక నేతలను సీబీఐ అరెస్టు చేసింది. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నేటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసులో గుజరాత్ హోంమంత్రిగా ఉన్న అమిత్ షాను సీబీఐ 2010 జూలై 25న అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన నిర్దోషిగా బయట పడ్డారు. అమిత్ షాను అరెస్టు చేసినప్పుడు కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్ నేత పీ చిదంబరం ఉన్నారు. విచిత్రంగా అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయిన తర్వాత అదే సీబీఐ చిదంబరంను అరెస్టు చేసింది. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, బీజేపీ నేతలు గాలి జనార్ధన్రెడ్డి, కేంద్ర మాజీ రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ను కూడా సీబీఐ నాడు అరెస్టు చేసింది. వీరితోపాటు మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ నేత అశోక్చవాన్పై కూడా సీబీఐ దర్యాప్తు నిర్వహించింది.