మహబూబాబాద్: కక్షిదారులు తమ కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకోవాలని జిల్లా కోర్టు జడ్జి మహమ్మద్ రఫీ అన్నారు. శనివారం మహబూబాబాద్ (Mahabubabd) జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్అదాలత్ (Lok Adalat) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు క్షనికావేశంలో గొడవలు, ఘర్షణలకు దిగి తమ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకూడదని సూచించారు. చిన్న విషయాలకే పోలీస్ స్టేషన్లకు వెళ్లి కేసులు పెట్టి ఇబ్బందులకు గురికావద్దని పేర్కొన్నారు. భార్యాభర్తల కేసులు, కుటుంబ తగాదాలు, భూములకు సంబంధించిన విషయాలను రాజీమార్గంలో పరిష్కరించుకునే చక్కని అవకాశం ఉందని, దీనిని కక్షీదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపుల్ సీనియర్ స్వాతి, మురారి, కృష్ణతేజ్, న్యాయవాదులు పాల్గొన్నారు.
రాజీ మార్గంలో కేసులను పరిష్కరించుకోవాలి
ములుగు: పెండింగ్ కేసులను కక్షిదారులు రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని ములుగు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్య చంద్రకళ అన్నారు. జాతీయ లోక్ అదాలత్లో భాగంగా ములుగులోని కోర్టు భవనాల సముదాయంలో లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షణికావేశంలో నమోదైన కేసుల పరిష్కారానికి రాజీమార్గాన్ని ఎంచుకుంటే కక్షిదారులకు విలువైన సమయం ఆదా అవడంతో పాటు ప్రశాంత జీవనం పొందే అవకాశం లభిస్తుందన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు.