ముంబై,జూన్ 25 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటు చేసుకోనుంది! ఆపరేషన్ టైగర్ 3.0 పేరుతో జరుగుతున్న చీలికలో భాగంగా శివసేన (యూబీటీ)వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేతో రహస్యంగా సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నది. ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన సుమారు 20 మంది ఎమ్మెల్యేల్లో 14 మంది ఉద్ధవ్పై తిరుగుబాటు ప్రకటించేందుకు రెడీ అయ్యారు.
తమ నియోజక వర్గాల్లో అభివృద్ధి పనుల కోసం నిధులు అందకపోవడం, నాయకత్వంపై అసంతృప్తి కారణంగానే వీరు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితమే ఉద్ధవ్ వర్గంలోని ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరారు. ఇప్పుడు షిండే ఎమ్మెల్యేలపై దృష్టి సారించారనే వార్తలతో అప్రమత్తమైన ఉద్ధవ్ థాకరే తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక చర్చలు జరిపారు.