న్యూఢిల్లీ: పంజాబ్లో ‘ఆపరేషన్ కమలం’ మొదలైందని ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. లోక్సభలో ఏకైక ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గురువారం భరద్వాజ్ విలేకర్లతో మాట్లాడుతూ, ‘తమకు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వచ్చాయని పంజాబ్లోని ఆప్ ఎమ్మెల్యేలు చెప్పారు.
బీజేపీలో చేరితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో టికెట్లు, వై-క్యాటగిరి భద్రత, పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెబుతామని మా ఎమ్మెల్యేలకు ఆఫర్లు వచ్చాయి. ఇదంతా బీజేపీ చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’లో భాగం’ అని అన్నారు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాలుగో స్థానంలో నిలిచిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎందుకు బీజేపీలో చేరారని రింకూను భరద్వాజ్ ప్రశ్నించారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లోనూ రింకూ పోటీ చేస్తున్న జలంధర్లో బీజేపీ నాలుగో స్థానంలో నిలుస్తుందని అన్నారు.