వరంగల్ : మహా నగరపాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్ బాలసముద్రంలో రూ.78లక్షలతో నిర్మించిన పెట్ పార్క్ను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణి, జీఎండబ్ల్యూసీ కమిషనర్ ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ పెట్ల కోసం హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరంలో హైటెక్ హంగులతో పెట్ పార్క్ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. పచ్చని మొక్కలు, అందమైన పరిసరాలతో ఆహ్లాదం పంచేలా తీర్చిదిద్దడంతో పాటు పెట్స్ ఆడుకునేందుకు ఆట వస్తువులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
నగర వాసుల సౌకర్యార్థం ప్రభుత్వం మహానగరంలో ఎన్నో పార్కులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పార్క్ నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలని, త్వరలో పార్క్లో డాగ్ షో ఏర్పాటు చేయాలని సూచించారు. మేయర్ సుధారాణి మాట్లాడుతూ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పార్కులు, జంక్షన్లు ఏర్పాటు చేసి సర్వాంగ సుందరం తీర్చిదిద్దుతుతున్నామన్నారు. ఖాళీ స్థలాలను గుర్తించి పార్క్లను అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రావుల కోమల, సీహెచ్ఓ, ఈఈ లక్ష్మారెడ్డి, డీఈ సంతోష్ బాబు, వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్, ఏఈలు పాల్గొన్నారు.