లక్నో : ఉత్తర్ప్రదేశ్లో కప్పా వేరియంట్ కలకలం రేపుతోంది. ఈ వేరియంట్ ప్రభావంతో 66 ఏళ్ల మహిళ మృతి చెందింది. మృతురాలు సంత్ కబీర్ నగర్ జిల్లా నివాసి కాగా.. కొద్ది రోజుల కిందట ఆమెను గోరఖ్పూర్లోని బీఆర్డీ మెడికల్ కళాశాలలో చేర్చారు. ఈ విషయాన్ని మైక్రోబయాలజీ విభాగాధిపతి డాక్టర్ అమ్రేశ్ సింగ్ ధ్రువీకరించారు. కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ను ప్రమాదకరమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఇటీవల దేశంలో వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే 50కిపైగా కేసులు నమోదయ్యాయి. యూపీలో డెల్టా ప్లస్ తొలి కేసును గోరఖ్పూర్లో గుర్తించారు.
బీఆర్డీ మెడికల్ కాలేజీకి చెందిన మైక్రోబయాలజీ బృందం ఏప్రిల్, మే నెలల్లో కరోనా సోకిన 30 మంది కరోనా నమూనాలను సేకరించింది. వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఢిల్లీలోని ఐజీఐబీ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్)కి పంపగా.. ఫలితాలు బుధవారం వచ్చాయి. ఇందులో 27 మంది రోగులు డెల్టా వేరియంట్కు, మరో ఇద్దరు డెల్టా ప్లస్కు, ఒకరు కప్పా వేరియంట్ బారినపడ్డట్లు గుర్తించారు. యూపీలో డెల్టా ప్లస్, కప్పా వేరియంట్ కేసులు గుర్తించడం ఇదే తొలిసారని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటి వరకు కేవలం డెల్టా వేరియంట్ కేసులు రికార్డయినట్లు అధికారులు నిర్ధారించారు.