Terror attack | ఇజ్రాయెల్లోని జెరూసలెంలో బుధవారం ఉదయం వరుస పేలుళ్లు సంభవించాయి. బస్టాప్లను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పేలుళ్లు జరిపినట్లుగా తెలుస్తున్నది. ఈ దాడుల్లో ఒకరు మృతి చెందగా.. 15 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. పేలుళ్లకు గల కారణాలు ప్రస్తుతానికి వెల్లడి కాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గత కొన్నేండ్లలో ఇలాంటి పేలుళ్లను చూడలేదని అక్కడి పోలీసుల అధికారులు చెప్తున్నారు.
మొదటి పేలుడు ఉదయం 7 గంటలకు నగరం పశ్చిమ ద్వారం సమీపంలోని గివాట్ షావుల్ బస్టాప్ వద్ద జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి మరణించాడు. 11 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో బాంబును అమర్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. రెండో పేలుడు 30 నిమిషాల అనంతరం 7:30 గంటలకు ఉత్తర జెరూసలెంలోని రామోట్ జంక్షన్ సమీపంలో జరిగింది. రెండు బస్టాప్ల మధ్య దూరం 5 కి.మీ. బాంబులను రిమోట్తో పేల్చి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
జెరూసలెంలో జరిగిన ఇలాంటి దాడి ఇన్నాళ్లు తాను చూడలేదని, భద్రతా బలగాలు నిందితులను పట్టుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నాయని ఇజ్రాయెల్ పోలీసు కమిషనర్ కోబి షబ్తాయ్ తెలిపారు. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కాగా, నగరంలో మరిన్ని పేలుడు పదార్థాలు పెట్టే అవకాశాలను కొట్టిపారేయలేమంటున్న పోలీసులు.. వాటిని పట్టుకునేందుకు పలు కూడళ్లలో వెతుకుతున్నారు. ఇలాఉండగా, ఉగ్రదాడులకు సంబంధించి ముగ్గురు పాలస్తీనా అనుమానితులను జెరూసలెం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.