హైదరాబాద్, మార్చి 24(నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా విమానాలకు ఎనలేని డిమాండ్ నెలకొంటున్నది. వచ్చే 20 ఏండ్లలో భారత్లో 2,210 విమానాలకు డిమాండ్ ఉంటుందని అంచనా. హైదరాబాద్లో జరుగుతున్న ఆసియాలో అతిపెద్ద విమానాల ప్రదర్శనలో భాగంగా ఎయిర్బస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వీటిలో 1,770 చిన్న విమానాలకు డిమాండ్ ఉంటుందని అంచనావేసిన ఎయిర్బస్..440 మధ్య, పెద్ద తరహా విమానాలకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. కరోనాతో గత రెండేండ్లుగా డీలా పడిన దేశీయ విమాన రంగం తిరిగి పుంజుకుంటున్నది. దీంతో విమాన సర్వీసులకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఎయిర్బస్ ఇక స్పీడ్ పెంచింది. వచ్చే పదేండ్ల వరకు వారానికి ఒక్కో విమానాన్ని భారత్కు సరఫరా చేస్తామని ఎయిర్బస్ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రెమీ మైలార్డ్ ఈ సందర్భంగా తెలిపారు. దేశంలో ఆర్థికాభివృద్ధి శరవేగంగా పెరుగుతుందని, దీంతోపాటే విమాన ప్రయాణాలకు డిమాండ్ ఏర్పడుతుందని చెప్పారు. భారత్ అవసరాలకు తగ్గట్టుగా విమానాలను అందించగల సామర్థ్యం తమకు ఉందన్నారు. వచ్చే పదేళ్లలో భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా ఎదగనుందని, దీంతోపాటు దేశ ఆర్థిక వృద్ధి కూడా జీ-20లోని దేశాలకన్నా వేగంగా ఉంటుందన్నారు. చైనా, అమెరికాలతో పోల్చుకుంటే భారత్లో ఎయిర్ ట్రాఫిక్ అతితక్కువగా ఉన్నదని, రానున్న రోజుల్లో ఇక్కడ విమాన సేవలకు ఎంతో అవకాశముందని వారు వివరించారు.
దేశీయంగా హెలీకాప్టర్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వరంగ సంస్థ పవన్ హన్స్ లిమిటెడ్ (పవన్ హన్స్) మరో కీలక నిర్ణయం తీసుకున్నది. మైల్స్టోన్ ఏవియేషన్కి చెందిన ఆరు హెలీకాప్టర్లను లీజుకు తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థల మధ్య గురువారం అధికారిక ఒప్పందం జరిగింది.