నల్లగొండ ప్రతినిధి, జూన్ 7(నమస్తే తెలంగాణ) : మిషన్ కాకతీయ ఫలాలకు నిలువెత్తు నిదర్శనం కాకతీయుల కాలం నాటి చందుపట్ల రాసముద్రం చెరువు. ఒకప్పుడు వరద కోసం ఎదురుచూసే రైతులకు ప్రస్తుతం ఎప్పుడైనా చెరువు అడుగు చూద్దామంటే వీలు కావట్లేదు. పూడికతీత నాటి నుంచి ప్రతిఏటా వరద ఉధృతితో రాసముద్రం జలకళ సంతరించుకుంటున్నది. వరుసగా గత సంవత్సరం ఏడో ఏటా మత్తడి దూకింది. దాంతో దిగువన ఉన్న గొలుసు కట్టు చెరువులకు జల సత్వంగా మారింది. బోర్లు, బావుల్లో గణనీయంగా నీటి మట్టం పెరుగడంతో చెరువు పరిధిలోని వెయ్యి ఎకరాల ఆయకట్టుకు నీరందుతున్నది. 2015 ఏప్రిల్ 26న మిషన్ కాకతీయ పథకాన్ని ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్ స్వయంగా పలుగుపార పట్టి పూడికతీసి ప్రారంభించిన చెరువు రాసముద్రం.
నకిరేకల్ మండలం చందుపట్లలోని రాసముద్రం చెర్వు కాకతీయ వీరవనిత రాణి రుద్రమదేవి కాలంలో ఏడు శతాబ్దాల క్రితం తవ్విన చెరువుగా ప్రసిద్ధి ప్రసిద్ది. రాణి రుద్రమ సేవకుడైన పువ్వుల ముమ్మడి ప్రస్తుత రాసముద్రం చెరువును తొవ్వించినట్లుగా చందుపట్ల శాసనంలో చెక్కినట్లుగా చరిత్రకారులు చెబుతున్నారు. చరిత్రపరంగా ఇంతటి ప్రాధాన్యం కలిగిన చందుపట్ల రాసముద్రం చెర్వు సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై ధ్వంసమవుతూ వచ్చింది. అతి భారీ వర్షాలు కురిస్తే తప్పా చెరువుకు జలకళ వచ్చేది కాదు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ చెరువుల పునరుద్ధరణ కోసం మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆ పథకం ప్రారంభానికి సీఎం కేసీఆర్ చారిత్రాత్మకంగా ప్రాధాన్యత కలిగిన చందుపట్ల రాసముద్రం చెరువు వద్ద శంకుస్థాపన చేశారు. 2015 ఏప్రిల్ 26న సీఎం కేసీఆర్ స్వయంగా ఇక్కడికి వచ్చి ఎండ్లబండిపై వచ్చి తానే పలుగుపార పట్టి పూడికతీత పనులకు శ్రీకారం చుట్టారు. మొత్తం రూ.2.14 కోట్లతో రాసముద్రం చెరువులో పూడికతీత, కట్ట పటిష్టం, తూములు ఆధునీకరణ చేపట్టారు. ఇదే సమయంలో రాసముద్రం చెర్వుకు వరద నీరు వచ్చే కీలకమైన రెండు ఫీడర్ చానల్స్ను పునరుద్ధ్దరించారు. వానకాలంలో వర్షాలు ఆరంభం కాగానే ఏండ్ల తరబడి నీటికి నోచుకోని రాసముద్రం చెర్వు ఆ ఏడాది నుంచే రాసముద్రం పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకుంది.
వెయ్యి ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు
సుమారు 34.76 ఎంసీఎఫ్టీ సామర్థ్యం కలిగిన రాసముద్రం పరిధిలో గత ఏడేండ్లుగా 800 నుంచి వెయ్యి ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందుతున్నది. గతంలో బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. చెరువులోకి వచ్చిన నీటిని తూముల ద్వారా నేరుగా పొలాలకు వాడుకోకుండా రైతులు ఆదర్శంగా ముందుకు సాగుతున్నారు. వాస్తవంగా చెర్వు ప్రత్యక్ష ఆయకట్టు 243.28 ఎకరాలు. కానీ రైతుల సమిష్టి నిర్ణయంతో చెరువు దిగువన బోర్లు, బావుల ద్వారానే సాగునీటిని పారించుకుంటున్నారు. దీనికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత కరంటు పథకం అండగా నిలిచింది. చెరువు చుట్టుపక్కల ఉన్న రైతులు తామే స్వయంగా బోర్లు లేదా బావులు తవ్వించుకుని పొలాలను సాగుచేసుకుంటున్నారు. దీంతో ప్రతి ఏటా వానకాలంలో రాసముద్రం పరిధిలో 800 నుంచి 1000 ఎకరాలకు సాగునీరు సమృద్ధిగా అందుతున్నది. అదే యాసంగిలోనూ దాదాపు ఇంతే విస్తీర్ణంలో పంటలు సాగువుతున్నాయి. దీంతో రాసముద్రం చుట్టుపక్కల ప్రాంతాల్లో కరవుఛాయలు అనేవి లేకుండా పోయాయి.
ఏడో ఏటా మత్తడి దూకిన చెరువు
2015లో మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన రాసముద్రం దశ తిరిగింది. అదే ఏడాది నుంచి ఈ చెరువుకు పైభాగంలో ఏ మాత్రం వర్షాలు కురిసినా ఆ నీరంతా ఎర్రకుంట, చీమలగడ్డల మీదుగా ఫీడర్ చానల్స్ ద్వారా రాసముద్రంలోకి వచ్చి చేరుతుంది. దాంతో అప్పటి నుంచే చెరువు నిండుకుండలా మారి మత్తడి దూకడం మొదలైంది. తర్వాత నుంచి ఇప్పటివరకు ఎన్న డూ ఎండిన దాఖలాలు లేవు. ప్రతి ఏటా వర్షాలకు సమృద్ధిగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలకళ సంతరించుకుని మత్తడి దూకుతున్నది. వరుసగా ఏడో ఏటా అలుగు దూకుతూ సందడి చేసింది. రాసముద్రం నిండడం ద్వారా దిగువన ఉన్న గొలుసుకట్టు చెరువులకు జలసత్వం చేకూరుతుంది. ప్రతి ఏటా అలుగు పారుతుండడంతో కందిమళ్లవారిగూడెం చిన్నచెరువుతో పాటు మరో మూడు,నాలుగు చెరువులు నిండితున్నాయి. ఇక ప్రతి ఏటా చెరువు నిండుతుండడంతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న చేపపిల్లలను కూడా ఇందులో పెంచుతున్నారు. దాంతో మత్స్యకారులకు చేతినిండా ఏడాదంతా ఉపాధి లభిస్తుంది. చెరువుకట్ట మీద గంగదేవమ్మ గుడిని కూడా నిర్మించి మత్స్యకారులు ప్రతిఏటా పండుగ జరుపుతున్నారు