డిశ్చార్జి అయినా ఏడురోజులు హోమ్ క్వారంటైన్ తప్పనిసరి
గ్రేటర్లో 1600 అదనపు పడకలు
సిటీబ్యూరో, డిసెంబరు 25 (నమస్తే తెలంగాణ): టిమ్స్లో చికిత్స పొందుతున్న ఒమిక్రాన్ బాధితులందరూ క్రమంగా కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు మొత్తం 38 మంది ఒమిక్రాన్ బాధితులతో పాటు అనుమానిత లక్షణాలు, ప్రైమరీ కాంటాక్ట్స్తో కలిపి మొత్తం 45 మంది టిమ్స్లో ఉన్నట్లు డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్ వెల్లడించారు. వీరిలో కొందరి రిపోర్ట్స్ రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ సోకిన వారిలో 10 మందికి పైగా కోలుకున్నారని వివరించారు. వారి అభ్యర్థన మేరకు మరికొన్ని రోజుల పాటు దవాఖానలో ఐసొలేషన్లో ఉండేందుకు అనుమతి ఇచ్చినట్లు డైరెక్టర్ వివరించారు. ఒమిక్రాన్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన తరువాత మరో 7రోజుల పాటు కచ్చితంగా హోమ్ ఐసొలేషన్లో ఉండాలని చెప్పారు.
నగరంలో 1600 అదనపు పడకలు
పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులను దృష్టిలో పెట్టుకొని వైద్య, ఆరోగ్యశాఖ నగరంలో 1600 అదనపు పడకలను ఏర్పాటు చేసింది. చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్లో అదనంగా మరో 800 పడకలు, కొం డాపూర్, గోల్కో ండ, మలక్పేట, వనస్థలిపురం, మల్కాజిగిరి, నాం పల్లి తదితర ఏరి యా దవాఖానల్లో మరో 792 పడకలను అదనంగా ఏర్పాటు చేసినట్లు ఇటీవలే వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించిన విషయం తెలిసిందే. ఒక వేళ థర్డ్వేవ్ వచ్చినా ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వైద్య, ఆరోగ్యశాఖ సిద్ధంగా ఉన్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
వారికి మరింత పకడ్బందీగా..
విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి శంషాబాద్ విమానాశ్రయంలో మరింత పకడ్బందీగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు నగరంలో నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల్లో అధిక శాతం నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చినవారే ఉండడంతో విదేశాల నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి ఎయిర్పోర్టులో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.