న్యూఢిల్లీ: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరింత తేలిగ్గా వ్యాపించగలదని ప్రముఖ మైక్రో-బయాలజిస్ట్, వైరాలజిస్ట్ డాక్టర్ గగన్దీప్ కాంగ్ తెలిపారు. అలాగే అది మనుషుల రోగ నిరోధకతను కూడా తప్పించుకొని దాడి చేయగలదని హెచ్చరించారు. ఇది ఇప్పటి వరకు గుర్తించిన ప్రాంతాల్లో కంటే ఇంకా ఎక్కువ చోట్ల ఉండి ఉండవచ్చని చెప్పారు. ఒమిక్రాన్ గురించి క్లినికల్ డాటా రెండు వారాల్లో అందుతుందని, అప్పుడు దాని ప్రభావాన్ని పూర్తిగా అంచనా వేయగలమని తెలిపారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి బూస్టర్ (మూడో) డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. ఒమిక్రాన్ కట్టడికి ప్రయాణ నిషేధం పరిష్కారం కాదని, నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలని అభిప్రాయపడ్డారు.