E20 Petrol : ఈ20 పెట్రోల్ నాణ్యత (E20 Petrol Quality) పై వస్తున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం (Union Govt) మంగళవారం స్పష్టతనిచ్చింది. దేశవ్యాప్తంగా ఇంధన నాణ్యతను చమురు మార్కెటింగ్ సంస్థలు (OMC) నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని తెలిపింది. ప్రస్తుతం 87 వేలకుపైగా పెట్రోల్ బంకుల్లో రోజుకు 8 నుంచి 12 సార్లు కలుషిత/కల్తీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
దేశంలో ఇప్పటివరకు క్లోరైడ్ కలుషితానికి సంబంధించిన రెండు ఘటనలు మాత్రమే గుర్తించినట్లు పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆ రెండు పెట్రోల్ బంకుల్లో ఇంధన విక్రయాలను వెంటనే నిలిపివేసినట్లు పేర్కొన్నది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రెండు వేలకుపైగా ఇంధన నమూనాలను క్లోరైడ్, సల్ఫైడ్ కలుషితానికి పరీక్షించినట్లు వెల్లడించింది. ఎక్కడైనా కలుషితం లేదా కల్తీ బయటపడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టంచేసింది.
ఇంధన సరఫరా వ్యవస్థ మొత్తాన్ని ఓఎంసీలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించినట్లు తెలిపింది. ఈ20లో కలిపే ఇథనాల్ తప్పనిసరిగా బీఐఎస్ ఐఎస్ 15464 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్రం తెలిపింది. ఇథనాల్ స్వచ్ఛత కనీసం 99.6 శాతం ఉండాలని పేర్కొన్నది. ప్రతి సరఫరాతోపాటు నాణ్యత ధ్రువీకరణ నివేదిక తప్పనిసరిగా ఉండాలని వెల్లడించింది. ఇథనాల్ నిల్వకు ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ప్రతి ట్యాంకర్ను స్వీకరించే ముందు పైభాగం, దిగువ భాగం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించింది. ప్రతి డెలివరీకి ముందు కూడా నాణ్యత తనిఖీలు తప్పనిసరిగా చేస్తున్నట్లు పేర్కొన్నది. 2024 జూలై నుంచి 2026 జూన్ వరకు నాణ్యత ప్రమాణాలు పాటించని 302 ట్యాంకర్లను తిరస్కరించినట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో దాదాపు 10,500 కిలోలీటర్ల ఇథనాల్ ఉన్నట్లు తెలిపింది.