నేలతల్లి రంగుల సింగిడి సంతరించుకోగా.. పల్లె, పట్నం సప్తవర్ణాలతో పులకించింది. రంగురంగుల.. ఆనందాల కలయిక హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకొన్నారు. ఉదయం నుంచే చిన్నారులు, యువత రంగు డబ్బాలు పట్టుకొని కనిపించారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. పిల్లలు కేరింతలు కొట్టగా.. బ్యాండ్ మేళాల మధ్య యువతీ యువకులు డ్యాన్స్లతో హోరెత్తించారు.
మూసాపేట(అడ్డాకుల), మా ర్చి 18 : కందూరు క్షేత్రంలో ఓం నమః శివాయ నామస్మరణ మా ర్మోగింది. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున రథోత్స వం కనులపండువగా కొనసాగిం ది. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో జాతర ప్రాంగణం జనసంద్రాన్ని తలపించింది. ఈ సందర్భంగా పంచాక్షరి మంత్రాన్ని పఠించారు. తేరును లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. గురువారం మధ్యరాత్రి కామ దహనం చేశారు. అనంతరం స్వామి రథోత్సవ కార్యక్రమాలను ప్రారంభించారు. నిత్యోపాసన, రుద్రహోమం పూజలు నిర్వహించిన తర్వాత రథాన్ని జాతర ప్రాంగణం వరకు లాగారు. తిరిగి యథాస్థానం వరకు లాగి రథాంగహోమం, బలిహరణ కార్యక్రమాలు జరిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేయగా.. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అనంతరం స్వామి వారి నిజరూప దర్శనానికి అనుమతించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీ శ్యామలమ్మ, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.