అనుమానం పెనుభూతం. దానికి వయసుతో సంబంధం లేదు. బుద్ధితో కానీ, బంధంతో కానీ పన్లేదు. ఇందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాడు గుజరాత్లోని జుహాపురాకు చెందిన ఓ వయోధికుడు. ఈ పెద్దాయనకు 70 ఏండ్లు వచ్చాయి. వ్యాపారం నుంచి రిటైర్ అయిపోయి.. కృష్ణా రామా అనుకునే సమయంలో భార్యతో విభేదాలు మొదలయ్యాయి. చిలకాగోరింకలు కాస్తా ఉపూ్పునిప్పులా మారిపోయారు. వ్యవహారం విడాకుల వరకూ వెళ్లింది.
డైవోర్స్ సంగతి తేలేదాకా, విడివిడిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఓ రోజు భార్య తన సొంత కారును గ్యారేజ్కు తీసుకువెళ్లింది. ఆ బండిలో జీపీఎస్ డివైజ్ ఉన్నట్టు గుర్తించాడు మెకానిక్. ఆ విషయం ఆమెకు చెప్పాడు. ఇది తన భర్త పనే అని గ్రహించడానికి, ఆ ఇల్లాలికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంటనే మొగుడి మీద సైబర్ కేస్ పెట్టింది. పోలీసుల విచారణలో కూడా ఇది ఆ చాదస్తపు భర్త చర్యే అని తేలింది. తన భార్యకు అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానంతో.. ఆమె ప్రతి కదలికనూ కనిపెట్టడానికి ఈ చర్యకు పాల్పడ్డాడు. పెద్దాయన తన తప్పును బుద్ధిగా ఒప్పుకొన్నా, కేసు తప్పలేదు. శిక్షా తప్పకపోవచ్చు!