2022-23లో 2.50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం
26 జిల్లాల్లో 11 కంపెనీలతో ఒప్పందం కుదిరింది
29 నర్సరీల్లో ఆయిల్పామ్ మొక్కల పెంపకానికి ఏర్పాట్లు
అసెంబ్లీలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి వెల్లడి
హైదరాబాద్, మార్చి 14 (నమస్తేతెలంగాణ): ఇతర పంటలను ప్రోత్సహించే దిశగా ఆయిల్పామ్ సాగును విస్తరించాలని నిర్ణయించినట్టు వ్యవసాయ, ఉద్యాన శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. సోమవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు బాలసుమన్, సండ్ర వెంకట వీరయ్య, అంజయ్య యాదవ్, గండ్ర వెంకటరమణారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు ఆయిల్పామ్కు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించి, పంట విస్తీర్ణాన్ని పెంచడానికి వీలుగా 11 కంపెనీలకు ఫ్యాక్టరీ జోన్లను కేటాయించినట్టు తెలిపారు. ప్రభుత్వం, కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం.. ఆయిల్పామ్ తోటను పెట్టిన 36 నెలల్లో కంపెనీలు మిల్లులను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని వివరించారు.
రైతులకు మొక్కలు అందించేందుకు, ప్రతి సంవత్సరం 2.25 కోట్ల మొకలను పెంచేలా ఆయా కంపెనీలు 29 నర్సరీలను ఏర్పాటు చేశాయని వెల్లడించారు. కోస్టారికా, మలేషియా, థాయిలాండ్ దేశాల నుంచి పామాయిల్ విత్తనాలను దిగుమతి చేసుకొని నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 2022-23లో 26 జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాలలో ఆయిల్పామ్ మొకలు అందించేందుకు సన్నద్ధమవుతున్నామని తెలిపారు. ఆ పంటలను సద్వినియోగం చేసేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, అప్పారావుపేట వద్ద ఆయిల్ ఫెడ్ గంటకు 30 ఎంటీ సామర్థ్యంతో రెండు ప్రాసెసింగ్ యూనిట్లను నడుపుతున్నదని వివరించారు.వచ్చే సీజన్ నుంచి డ్రిప్ సబ్సిడీలో సమస్య రాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రాష్ట్రంలో పంటల సాగుకు సంబంధించి రైతువేదికల్లో రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందుకు అనుగుణంగా సిలబస్ను రూపొందించామని చెప్పారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల ద్వారా రైతులకు శిక్షణ కల్పిస్తామని అన్నారు. వ్యవసాయ సిలబస్ను వినియోగించుకోవాలని రైతులను మంత్రి కోరారు.
మంత్రి స్పీచ్లో కీలకాంశాలు ఆయన మాటల్లోనే
ఆయిల్పామ్ పంట సాగు చేపట్టేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం.
ఇప్పటికే 79 క్షేత్ర పర్యటనల ద్వారా 8,460 మంది రైతులకు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పించాం.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు నేనే స్వయంగా లేఖలు రాశాను.
ఆయిల్పామ్ పంట సాగు చేస్తే ఎకరానికి రూ.11,600, ఎరువులు, అంతర పంటల కోసం సంవత్సరానికి ఎకరానికి రూ.4,200లు చొప్పున నాలుగేండ్ల వరకు రాయితీ అందిస్తాం.
ఎకరానికి రూ.20,317 చొప్పున బిందు సేద్యానికి రాయితీ అందిస్తాం.
ఒక రైతుకు 12.5 ఎకరాల వరకు సబ్సిడీ వర్తిస్తుంది.