War effect : ఇరాన్ (Iran) తో అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు (Oil prices) పెరుగుతున్నాయి. అయినా దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ (Petrol, Diesel) ధరలు దాదాపు యథాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ముడి చమురు (Crude Oil) ధర ఒక దశలో యాభై శాతం పెరిగింది. కానీ మన వద్ద చమురు కంపెనీలు ధరలను స్థిరంగా కొనసాగించాయి. దాంతో చమురు కంపెనీలకు రూ.30 వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఫిబ్రవరి 28న ఇరాన్ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ఒక బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్ల వద్ద ఉండగా.. ప్రస్తుతం 100 డాలర్లకుపైగా పలుకుతోంది. ఒక దశలో 144 డాలర్లకు కూడా చేరుకుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇంధన సరఫరాను నిరంతరాయంగా కొనసాగించాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయ చమురరంగ సంస్థలు పెంచకపోవడంతో ఈ మూడు కంపెనీలు రూ.30 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయి.
కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్పై లీటర్కు రూ.10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దాంతో నష్టాలు రూ.62,500 కోట్ల నుంచి రూ.30 వేల కోట్లకు తగ్గాయి. అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరకు అదనంగా మరికొన్ని ఖర్చులను భరించాల్సి వచ్చింది. రవాణా నౌకలను దారి మళ్లించడం, బీమా ప్రీమియాలు పెరగడం వంటి ఖర్చులు జత కలిశాయి.