సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నాలాల పూడికతీత పనులను పాత పద్ధతిలోనే నిర్వహించాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం (సీఆర్ఎంపీ) తరహా నాలాల నిర్వహణను జోనల్ వారీగా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలని భావించిన జీహెచ్ఎంసీ అధికారులు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరిపారు. ఏడాదికి నాలాల పూడికతీత కోసం రూ.25 కోట్ల మేర ఖర్చు చేస్తుండగా, ఈ పనులు పారదర్శకంగా ఉండటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేలా నిబంధనలకు రూపకల్పన చేశారు.
టెండర్ నిర్వహణ కసరత్తులో భాగంగా ఒక్కో యంత్రం రోజుకు ఎన్ని గంటలు పనిచేయాలి? ఎన్ని యంత్రాలు ఉండాలి? ఏ రకం యంత్రాలు ఉపయోగించాలనేది? పూడికమట్టి రోడ్డుపై పడకుండా డంపింగ్ యార్టుకు తరలించడం? ప్రత్యేక రకం ట్రాలీలున్న టిప్పర్లను ఉపయోగించడం? ఇరుకు గల్లీల్లో తిరుగుతూ వాటి మధ్యలో ప్రవహించే నాలాల పూడికతీతకు చిన్నపాటి జేసీబీలు, ట్రక్కులు, ప్రత్యేక రకం ట్రాలీలున్న టిప్పర్ల వినియోగంపై సమగ్ర నివేదిక సిద్ధం చేశారు. ప్రస్తుతం కంటే ఏడాదికి అదనంగా రూ.30 కోట్ల మేర నిర్వహణ భారం పడుతుందని తేల్చారు. ఐదేండ్లకు గానూ రూ. 150 కోట్ల మేర అవుతున్న అదనపు ఖర్చు భరించలేమని భావించిన అధికారులు పాత పద్ధతి వైపే మొగ్గు చూపారు. అన్నింటికంటే ముఖ్యంగా జోరు వర్షాలు, అత్యవసర సమయాల్లో ప్రైవేట్ ఏజెన్సీలు పనులు చేపట్టడం కత్తిమీద సాములా ఉంటుందని తేల్చారు.
సంస్కరణలతో మెరుగ్గా నిర్వహణ..
నాలాల నిర్వహణను పాత పద్ధతిలోనే చేపట్టాలని నిర్ణయించిన జీహెచ్ఎంసీ అధికారులు మెరుగైన సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో కంటే చిన్నచిన్న భాగాలుగా విభజించి పనులు అప్పగించనున్నారు. అంతేకాకుండా సామాజిక తనిఖీలు నిర్వహించనున్నారు. పనులు జరిగిన తీరు, నిర్వహణ మొత్తంపై స్థానికుల అభిప్రాయాలు తీసుకుంటారు. టెండర్ ప్రక్రియ నుంచి పనుల పూర్తి వరకు మొబైల్ యాప్తో పర్యవేక్షించనున్నారు. క్షేత్రస్థాయి అధికారి నుంచి కమిషనర్ వరకు నిత్యం పనులను మొబైల్ యాప్లో పనులను పరిశీలిస్తారు.