అమరావతి : మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వార్ధా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 11 మంది గల్లంతయ్యారు. బెనోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని వరుద్ తాలూకాలోని జుంజ్ గ్రామం సమీపంలో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. నదిలో నుంచి ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలు వెలికి తీయగా.. మరో ఎనిమిది ఆచూకీ దొరకలేదు. సమాచారం అందుకున్న బెనోడా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్నారు.
అయితే, పడవ ప్రమాదానికి మాత్రం సరైన కారణాలు తెలియరాలేదు. గత ఎనిమిది రోజులుగా భారీ వర్షాల కారణంగా వార్ధా జిల్లాలో నదులు పొంగిపొర్లుతున్నాయి. నదికి ఒక వైపు నుంచి మరో వైపు వెళ్తుండగా పడవ ప్రమాదానికి గురైంది. పడవలో ఎక్కువ మంది ఉండడం కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో 20 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. పడవ నది మధ్యలో ఉండ మునిగిపోయింది. స్థానికులు వెంటనే గమనించి నీటిలో మునిగిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
కొంత మందిని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చారు. ఇప్పటివరకు, మూడు మృతదేహాలను వెలికితీశారు. మరో ఎనిమిది మంది కోసం అన్వేషణ కొనసాగుతోంది. విషయం తెలుసుకొని పెద్ద ఎత్తున జనం ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. గల్లంతైన వారిలో 11 మంది ఒకే కుటుంబానికి చెందిన వారిగా భావిస్తున్నారు. వారంతా దశదిన ఖర్మ కోసం గాదెగావ్కు వచ్చారు. కార్యక్రమం అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకున్నది.