హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): అడవి బిడ్డలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు చేపట్టిన గిరిపోషణ్ సత్ఫలితాలు ఇస్తున్నది. మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా మొదలైన ఈ కార్యక్రమం దశలవారీగా అన్ని అటవీ గ్రామాలకు విస్తరించింది. ఇక్రిశాట్, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) సంయుక్త పర్యవేక్షణలో రూపొందించిన పోషక ఆహారాన్ని అందజేయటంతో గిరిజనుల ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు వచ్చాయని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. జాతీయ కుటుంబ సర్వే వెల్లడించిన గణాంకాలను పరిగణనలోకి తీసుకొని మహిళల్లో రక్తహీనత తగ్గుదల, చిన్నారుల్లో ఎత్తు, బరువు సమస్యలను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గిరిపోషణ్ను చేపట్టింది.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహారానికి అదనంగా జొన్నలు, ఇతర చిరుధాన్యాలు ఇవ్వటంతో సత్ఫలితాలు వస్తున్నాయి. స్థానికంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలను ప్రాసెసింగ్ చేసి, రుచికరంగా తయారుచేసి ఇవ్వటం కోసం ఇక్రిశాట్ ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లోని జీసీసీ (గిరిజన సహకార సంస్థ) స్వయం సహాయక సంఘాలను భాగస్వామ్యం చేశారు. స్వయం సహాయక సంఘాలకు ఉపాధి కల్పించటం, పౌష్టికాహారాన్ని అందించాలనే ప్రభుత్వం అనుసరించిన ద్విముఖ వ్యూహం సత్ఫలితాలిస్తున్నది.
గిరిపోషణ్ను 2017-18లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని 5,069 మంది పిల్లలు, గర్భిణులు, బాలింతలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. చెంచు, కొలామ్, థోటి, కొండరెడ్డి తెగల ఆరోగ్యరక్షణకు చేపట్టిన గిరిపోషణ్ ను దశలవారీగా మిగతా తెగలకు, మిగతా ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని చిన్నారులు వయస్సుకు తగ్గ ఎత్తులేకపోవటం (స్టెంటింగ్), వయసుకు తగ్గ బరువులేకపోవటం (అండర్వెయిట్), ఎత్తుకు తగ్గ బరువు లేకపోవటం (వెస్టింగ్)లోపాలను అధిగమిస్తున్నారు.
రక్తహీనత 40 శాతం నుంచి 21 శాతానికి తగ్గింది.
తక్కువ జనన బరువు ప్రమాదం 56 శాతం నుంచి 50 శాతానికి తగ్గింది.
గిరిపోషణ్కు దేశవ్యాప్త గుర్తింపు
గిరిజనుల పోషకాహారలోప నివారణే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. రాష్ర్టాన్ని పోషకాహారంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. అందుకు అనుగుణంగా చేపట్టిన గిరిపోషణ్ కార్యక్రమానికి దేశవ్యాప్త గుర్తింపు వస్తున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు మెరుగైన, శాస్త్రీయమైన పోషకాహారాన్ని అందిస్తున్నాం. ఎప్పటికప్పుడు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పర్యవేక్షిస్తున్నాం.- మంత్రి సత్యవతి రాథోడ్