మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. పుట్టిన శిశువు చనిపోయిందని నమ్మించి రూ.1.50 లక్షలకు నర్సు అమ్మేసింది.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం లక్ష్మీనగర్ తండాకు చెందిన నస్రా ఫాతిమా సికింద్రాబాద్ మౌలాలిలో ఉంటుంది. ఏడు నెలల గర్భిణీ అయిన ఆమె ఇటీవల అత్తారింటికి బయల్దేరింది. మెదక్ చేరుకున్న ఆమె చేతిలో చిప్స్ ప్యాకెట్ చూసిన కోతులు ఆమెపై దాడిచేశారు. ఇది గమనించి ఫాతిమాను ఆమె స్నేహితురాలు స్థానిక ఆస్పత్రికి తరలించింది. అక్కడ శస్త్ర చికిత్స అనంతరం ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే పుట్టిన పాప చనిపోయిందని ఆస్పత్రి నర్స్ అక్తరీ బేగం నమ్మించింది. అదే నిజమనుకుని ఫాతిమా నమ్మేసింది. మూడు రోజుల చికిత్స అనంతరం ఫాతిమా ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చేసింది. ఐదు రోజులకు మెదక్ వచ్చిన బాధితురాలికి తన పాప బతికే ఉందని ఓ వ్యక్తి సమాచారం అందించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నర్స్ అక్తరీ బేగంను విచారించగా.. పాపను నాసిన్ ఉన్నిసాకు అప్పగించినట్లు తెలిసింది. ఆమె సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్ ఇక్బాలుద్దీన్, నదియాసుల్తానా దంపతులకు రూ.1.50లక్షలకు విక్రయించినట్లు నిర్ధారించారు. నర్సుతో పాటు మధ్యవర్తిని, పాపను కొనుగోలు చేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.