అమరావతి : ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడం అత్యంత దుర్మార్గమైన విషయమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ అన్నారు. ఎన్టీఆర్ పేరును తొలిగించి వైఎస్సార్ పేరును పెట్టడాన్ని మండలి సమావేశంలో తీవ్రంగా వ్యతిరేకించామని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ వర్సిటీకి మరోసారి మహనీయుడు ఎన్టీఆర్ పేరునుపెడతామని తెలిపారు.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని బీజేపీ , వామపక్ష, పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ముక్తకంఠంతో వ్యతిరేకించారని ఆయన వెల్లడించారు. తెలుగు జాతి మొత్తం బాధపడే నిర్ణయాన్ని జగన్ తీసుకున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ పేరు మార్చడాన్ని వైసీపీ నేతలూ ఇష్టపడడం లేదని అన్నారు. 1998లో వర్సిటీకి ఎన్టీఆర్ పేరును చంద్రబాబు పెట్టారని గుర్తు చేశారు. హైదరాబాద్ లోనూ కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టారని తెలిపారు. కడప జిల్లాకు వైఎస్సార్ జిల్లా పేరును మార్చారరని వెల్లడించారు.
ఇవాళ మండలిలో చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించి సభ్యుల హక్కులను కాలరాస్తూ మార్షల్ సహాయంతో బయటకు పంపించివేశారని తెలిపారు. మండలిలో ప్రవేశపెట్టిన తొమ్మిది బిల్లులపై ఎలాంటి చర్చ పెట్టకుండా ఏకపక్షంగా తొమ్మిది నిమిషాల్లో ఆమోదం తెలిపారని అన్నారు.