పోస్టాఫీస్లో కేవైసీ నిబంధనలకు లోబడి నేషనల్ పెన్షన్ స్కీం (ఎన్పీఎస్) ఖాతాను 18-70 ఏండ్ల భారతీయులెవరైనా తెరుచుకోవచ్చు. ఎన్పీఎస్ కోసం ఇండియా పోస్ట్ గత నెల 26న ఆన్లైన్ సేవలనూ ప్రారంభించింది. దీంతో పోస్టాఫీస్కు వెళ్లకుండానే ఎన్పీఎస్లో పెట్టుబడులు పెట్టవచ్చు.
కస్టమర్ ఎంచుకున్న పీవోపీ-ఎస్పీల వద్ద నగదు, స్థానిక చెక్కు, డీడీ లేదా ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ (ఈసీఎస్) ద్వారా చెల్లింపులు చేయవచ్చు. అయితే రూ.50వేలు దాటితే పాన్ వివరాలను సమర్పించాల్సిందే. కొత్త రిజిస్ట్రేషన్లు, తదుపరి చెల్లింపులు, సిప్ల కోసం కూడా ఈ ఆన్లైన్ సేవలను సబ్స్ర్కైబర్లు వినియోగించుకోవచ్చు.
ఎన్పీఎస్ కోసం ఒక్కసారి సబ్స్ర్కైబర్ నమోదు చేసుకుంటే.. వారు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ లేదా సిప్) కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సిప్ ద్వారా ఎన్పీఎస్లో పెట్టుబడులు పెడితే ప్రయోజనాలూ ఉంటాయి. ముఖ్యంగా మీకు అనువైన మొత్తాల్లో పెట్టుబడులకు వెళ్లవచ్చు.
అయితే ఇందుకు మీ ఎన్పీఎస్ ఖాతా యాక్టీవ్గా ఉండాలి. ఖాతాతో మీ ఫోన్ నెంబర్, ఈ-మెయిల్, నెట్-బ్యాంకింగ్లు అనుసంధానం కావాలి. ఇక సిప్ ఏర్పాటు కోసం కనీసం రూ.500, గరిష్ఠంగా లక్ష రూపాయలు అవసరం. వన్ టైం సిప్ ఏర్పాటు రుసుము కూడా రూ.3.5 (పన్నులు అదనం). సిప్ల ద్వారా ఎన్పీఎస్లో నెలసరి, త్రైమాసికం, అర్ధవార్షికం, వార్షిక పద్ధతుల్లో పెట్టుబడులు
పెట్టవచ్చు.
ముందుగా www.indiapost.gov.inలోకి లాగిన్ అవ్వాలి. మెనూలో ఎన్పీఎస్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆన్లైన్ సర్వీసెస్లోకి వెళ్లాలి. సిప్ యాక్టివేషన్ను ఎంచుకుని రిజిస్టర్ సిప్లోకి పోవాలి. ఆపై శాశ్వత రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్), పుట్టిన తేదీలను ఎంటర్ చేయాలి. ఈ-మెయిల్, మొబైల్ నెంబర్ వివరాలతో సబ్మిట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఓటీపీ వచ్చాక ‘కంటిన్యూ’పై క్లిక్ చేయాలి.
ఎన్పీఎస్లో కొత్త సిప్ నమోదును ఎంచుకోవాలి. నగదు, మెచ్యూరిటీ తదితర వివరాలివ్వాలి. ఆపై అప్రూవల్ కోసం బ్యాంక్కు సిప్ నమోదు వెళ్లిపోతుంది. బ్యాంక్ నుంచి అనుమతి వస్తే ఖాతాల నుంచి నగదు చెల్లింపులు ఎంచుకున్న ప్రకారం జరుగుతూ ఉంటాయి.