Choe Hyon : ఉత్తరకొరియా (North Korea) తన నౌకాదళ చరిత్రలోనే అత్యంత కీలక ఘట్టానికి తెరలేపింది. భారీ యుద్ధనౌక (War ship) ను అధికారికంగా తన నౌకాదళంలో ప్రవేశపెట్టి అంతర్జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. ‘చో హ్యోన్ (hoe Hyon)’ అని పిలిచే 5,000 టన్నుల అత్యాధునిక డిస్ట్రాయర్ను దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) సమక్షంలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యం కలిగిన ఈ నౌకతో తమ నావికాదళాన్ని అణుశక్తిగా మార్చాలన్న కిమ్ ఆకాంక్ష ఈ చర్య ద్వారా స్పష్టమవుతోంది. పశ్చిమ తీరంలోని నాంపో నౌకాశ్రయంలో ఈ లాంచింగ్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్ జోంగ్ ఉన్ మాట్లాడుతూ.. ‘గడిచిన ఏడు దశాబ్దాలుగా నౌకాదళంలో నెలకొన్న స్తబ్దతకు ఈ యుద్ధనౌకతో ముగింపు పలికాం’ అని వ్యాఖ్యానించినట్లు అక్కడి అధికారిక మీడియా తెలిపింది. కాగా విమాన విధ్వంసక వ్యవస్థలు, యాంటీ-షిప్ క్షిపణులతోపాటు అణు సామర్థ్యం కలిగిన క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను కూడా ‘చో హ్యోన్’ ప్రయోగించగలదు. ఇది ప్రధానంగా దేశ పశ్చిమ తీరంలో గస్తీ నిర్వహించనుంది. అక్కడి మీడియా కథనాల ప్రకారం యుద్ధనౌక లాంచింగ్ సందర్భంగా కిమ్ పలు కీలక ప్రకటనలు చేశారు. రాబోయే ఐదేళ్లలో ఏటా రెండు ‘చో హ్యోన్’ తరహా డిస్ట్రాయర్లను నిర్మిస్తామని వెల్లడించారు.
వీటితోపాటు 10 వేల టన్నుల భారీ యుద్ధనౌకలను, కొన్ని అత్యంత శక్తిమంతమైన ‘రహస్య జలాంతర్గత ఆయుధాలను’ కూడా అభివృద్ధి చేయాలని కిమ్ రక్షణ రంగాన్ని ఆదేశించారు. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికే ఈ ఆయుధ సమీకరణ చేపడుతున్నట్లు ఆయన స్పష్టంచేశారు. అంతర్జాతీయ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ ఈ డిస్ట్రాయర్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే నిర్మించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. 2025లో జలప్రవేశం చేసిన ఈ నౌకపై ఇప్పటికే పలు దశల్లో పరీక్షలు నిర్వహించారు.
తాజా పరిణామాలు కొరియా ద్వీపకల్పంలో భద్రతా పరమైన ఉద్రిక్తతలను మరింత పెంచాయి. ఉత్తర కొరియా వేగంగా చేపడుతున్న సైనిక ఆధునికీకరణపై అమెరికా, దక్షిణ కొరియా దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.