హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): జిల్లా పరిధిలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్ సెంటర్లో నార్మల్ డెలివరీ అయిన ప్రతిసారి ఒక మొక్కను నాటాలని వైద్య సిబ్బందికి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బీబీనగర్ పీహెచ్సీలో నార్మల్ డెలివరీ అయిన బాలింత పొడిసెట్టి శ్రావణితో కలిసి అక్కడి సిబ్బంది మొక్కను నాటారు. ఈ సందర్భంగా శ్రావణి సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ సత్పతి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. నార్మల్ డెలివరికో మొక్క నాటాలనే నిర్ణయాన్ని గ్రీన్ చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్కుమార్ ట్విట్టర్ వేదికగా అభినందించారు.