హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా మూతపడిన గురుకుల విద్యాసంస్థల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు కల్పించి, అన్ని మరమ్మతులు వెంటనే చేపట్టాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లకు ఇప్పటికే రూ.20 వేలు ఇచ్చామని గుర్తుచేశారు. ఆహార పదార్థాలు, కాస్మొటిక్స్ కొరత లేకుండా గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ)తో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గురుకులాలు, హాస్టళ్ల పునఃప్రారంభంపై హైదరాబాద్లోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో గురువారం మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిదర్శిని కార్యక్రమంలో భాగంగా తండాలు, గూడేళ్లో ప్రతి ఇంటికి వెళ్లి విద్యార్థుల నమోదు చేపట్టాలని చెప్పారు.