న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ఆరోగ్య బీమా ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) తగ్గింపునకు సంబంధించి జీఎస్టీ కౌన్సిల్ పరిశీలనలో ఎటువంటి సిఫార్సు లేదని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కే కరాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆరోగ్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ పడుతున్నది. ఇదిలావుంటే ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరు నాటికి దేశంలో ఏటీఎంల సంఖ్య 2.13 లక్షలను దాటేసిందని చెప్పారు. ఇందులో 47 శాతానికిపైగా గ్రామీణ, మోస్తరు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయన్నారు.
ఇక టాటాల గూటికి చేరిన ఎయిర్ ఇండియాకు వివిధ ప్రభుత్వ శాఖలు, స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల నుంచి రూ.244 కోట్లకుపైగా బకాయిలు రావాల్సి ఉందని వెల్లడించారు. మరోవైపు విదేశీ మారకపు నిల్వల్లో భారత్.. ప్రపంచంలోనే నాల్గో స్థానంలో ఉన్నదని కేంద్ర ఆర్థిక శాఖ మరో సహాయ మంత్రి పంకజ్ చౌధరి చెప్పారు. కాగా, గత నెల 26 నాటికి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు చెందిన 9.8 లక్షల ఖాతాలను ప్రభుత్వ రంగ బ్యాంకులు పునర్వ్యవస్థీకరించాయని, వీటి విలువ రూ.58,524 కోట్లని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎయిర్ ఇండియా రూ.2,350 కోట్లు, స్పైస్జెట్ రూ.185 కోట్లు, అలయన్స్ ఎయిర్ రూ.109 కోట్లు, గో ఎయిర్ రూ.56 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉన్నాయని రాజ్యసభలో కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ చెప్పారు. అలాగే కరోనా నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం (2020-21) దేశంలోని ఎయిర్లైన్స్కు రూ.19,564 కోట్ల నష్టాలు, ఎయిర్పోర్ట్స్కు రూ.5,116 కోట్ల నష్టాలు వచ్చినట్లు అంచనా ఉందన్నారు.