MK Stalin : హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పారు. త్రిభాషా విధానంపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్రముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారు. తమిళ భాషను రాష్ట్ర ప్రజలు ప్రాణంగా ప్రేమిస్తారని, దానిని మరుగుపరిచే ఎలాంటి చర్యనైనా తాము ఎన్నటికీ సహించమని చెప్పారు.
తమిళనాడులో హిందీకి ఎప్పుడూ స్థానం లేదని, భవిష్యత్తులోనూ ఉండదని స్టాలిన్ స్పష్టంచేశారు. ఆదివారం నిర్వహించిన తమిళ భాషా అమరవీరుల దినోత్సవంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళ ప్రజలు హిందీకి వ్యతిరేకంగా గతంలో తీవ్ర పోరాటం చేశారని స్టాలిన్ గుర్తుచేశారు. హిందీని తమపై రుద్దాలని చూసిన ప్రతిసారీ.. అదే తీవ్రతతో తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పారు.
జాతీయ విద్యావిధానాన్ని అమలుచేయడం లేదన్న కారణంతో కేంద్రం తమిళనాడుకు రావాల్సిన నిధులను నిలిపివేస్తోందని స్టాలిన్ ఆరోపించారు. అయినప్పటికీ ఈ విషయంలో తాము వెనకడుగు వేయమన్నారు. 1965లో తమిళనాడులో నెలకొన్న హిందీ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన వీడియోను ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆ నిరసనల్లో ప్రాణత్యాగం చేసిన తమిళ భాషా అమరవీరులకు నివాళులు అర్పించారు. హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, తమిళ భాషా పరిరక్షణ కోసం 1965లో తమిళనాడులో భారీ ఉద్యమం జరిగింది. నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఎంతోమంది ఆందోళనకారులు తమ ప్రాణాలర్పించారు. అమరవీరుల త్యాగాలకు గుర్తుగా తమిళనాడు ప్రభుత్వం గత ఏడాది నుంచి జనవరి 25 వ తేదీని తమిళ భాషా అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తోంది.