న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను అత్యున్నత న్యాయస్థానం పరిశీలించింది. 29 ఫోన్లను పరీక్షించగా, దాంట్లో అయిదు ఫోన్లలో మాల్వేర్ ఉన్నట్లు గమనించామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. కానీ ఒక్క ఫోన్లో కూడా పెగాసస్ స్పైవేర్ ఉన్నట్లు గుర్తించలేదు అని కోర్టు తెలిపింది. అయితే పెగాసస్ అంశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించడంలేదని కమిటీ చెప్పినట్లు చీఫ్ జస్టిస్ వెల్లడించారు. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.
సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీనే ఈ రిపోర్ట్ను తయారు చేస్తోంది. మూడు భాగాలుగా రిపోర్ట్ను ఇవ్వనున్నారు. దీంట్లో రెండు టెక్నికల్ కమిటీ రిపోర్ట్లు ఉంటాయి. రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ మరో నివేదికను సమర్పిస్తారు. రవీంద్రన్ సమర్పించే నివేదికను తమ వెబ్సైట్లో పబ్లిక్గా పెట్టనున్నట్లు సీజేఐ తెలిపారు. తొలి రెండు భాగాలకు చెందిన రిపోర్ట్ కావాలని కొందరు పిటిషనర్లు అడగ్గా దానిపై పరిశీలిస్తామని సీజేఐ పేర్కొన్నారు. ఈ కేసు విచారణను మరో నాలుగు వారాలకు వాయిదా వేశారు. కేసును విచారించిన ధర్మాసనంలో సీజేఐ రమణతో పాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీ ఉన్నారు.