హైదరాబాద్: కరోనా వైరస్ను నియంత్రించేందుకు హైదరాబాద్కు చెందిన భారత్బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను డెవలప్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ టీకా ప్రొక్యూర్మెంట్ను ఐక్యరాజ్యసమితి నిలిపేయాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. దీనిపై ఇవాళ భారత్ బయోటక్ సంస్థ స్పందించింది. యూఎన్ ఏజెన్సీ కోసం కోవాగ్జిన్ టీకాను సరఫరా చేయలేదని భారత్బయోటెక్ సంస్థ స్పష్టం చేసింది. డబ్ల్యూహెచ్వో తీసుకున్న చర్యల వల్ల తమపై ఎటువంటి ప్రభావం పడలేదని కూడా ఆ కంపెనీ వెల్లడించింది. ఇప్పటి వరకు భారత్తో పాటు మరో 9 దేశాలకు మాత్రమే కోవాగ్జిన్ టీకాను సరఫరా చేశారు. ఎమర్జెన్సీ వాడకం కింద మాత్రమే ఆ వ్యాక్సిన్ సరఫరా జరిగింది.
సుమారు 25 దేశాల నుంచి అత్యవసరం వినియోగం కింద కోవాగ్జిన్కు అనుమతి దక్కిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు యూఎన్ ఏజెన్సీ నుంచి మాత్రం తమ టీకాకు ఆర్డర్లు రాలేదని ఆ కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గవి కోవాక్స్ ఇప్పటి వరకు తమకు కోవాగ్జిన్ కావాలని ఆర్డర్ చేయలేదని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రాల్లో లోపాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏప్రిల్ 2వ తేదీన ఓ రిపోర్ట్ను ఇచ్చింది. కోవాగ్జిన్ కొనుగోలును నిలిపివేయాలని కూడా యూఎన్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలను డబ్ల్యూహెచ్వో కోరింది.
భారత్ బయోటెక్ సంస్థను తనిఖీ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. తమ ప్లాంట్లను అప్గ్రేడ్ చేసుకోవాలని ఆ కంపెనీకి సూచించింది. జీఎంపీ లోపాలు ఉన్నట్లు తన నివేదికలో డబ్ల్యూహెచ్వో పేర్కొన్నది. సదుపాయాల అప్గ్రడేషన్ గురించి ఇవాళ కంపెనీ వర్గాలు స్పందిస్తూ.. కోవాగ్జిన్ తయారీ కోసం మాత్రమే సదుపాయాలను డిజైన్ చేయలేదని తెలిపాయి. ఇతర వ్యాక్సిన్ల తయారీ కోసం ఉన్న ఉత్పత్తి కేంద్రాల ద్వారా కోవాగ్జిన్ తయారీకి వాడుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న తయారీ సదుపాయాల్ని అప్గ్రేడ్ చేసి వంద శాతం కోవాగ్జిన్ ఉత్పత్తికి వాడనున్నట్లు కొన్ని వర్గాలు వెల్లడించాయి. తమ వ్యాక్సిన్ సర్టిఫికేట్కు విలువ ఉందని, ఇండియాలో సరఫరాకు ఎటువంటి ఆటంకం లేదని భారత్ బయోటెక్ సంస్థ వర్గాలు తెలిపాయి. ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ కోసం కోవాగ్జిన్ ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ సంస్థ తన ట్విట్టర్లో వెల్లడించిన విషయం తెలిసిందే.