లండన్ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న అనంతరం రక్తం గడ్డకట్టే దుష్ప్రభావాలు తలెత్తే అవకాశాలు దాదాపు ఉండవని తాజా అధ్యయంలో తేలింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత మాత్రమే అరుదుగా అతికొద్ది మందిలోనే థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపేనియా సిండ్రోమ్ (టీటీఎస్) దుష్ప్రభావం కనిపిస్తోందని గుర్తించారు. రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్ సంఖ్య పడిపోవడం (థ్రాంబోసైటోపేనియా) అనే రెండు దుష్ప్రభావాలు ఏకకాలంలో రోగిలో తలెత్తితే దాన్ని టీటీఎస్ సిండ్రోమ్గా పిలుస్తారని తెలిపారు. ఆస్ట్రాజెనెకా ఆధ్వర్యంలో బ్రిటన్లో నిర్వహించిన అధ్యయనం వివరాలు ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. భారత్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ను కొవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. పలు చోట్ల ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మొదటి డోసు వేసిన తర్వాత టీటీఎస్ అరుదైన కేసులు నమోదయ్యాయి. దీంతో పలు దేశాలు టీకాను పరిమితం చేయడంతో పాటు పంపిణీని నిలివేశాయి.
ఆస్ట్రాజెనెకా రెండో మోతాదు తర్వాత టీటీఎస్ అంచనా రేటు మిలియన్ వ్యాక్సిన్లకు 2.3గా ఉందని నిపుణులు పేర్కొన్నారు. మొదటి మోతాదు తర్వాత ఈ రేటు మిలియన్కు 8.1గా ఉందని తెలిపారు. అయితే, టీకాలు వేసిన తర్వాత రక్తం గడ్డకట్టానికి గల ఖచ్చితమైన కారణాలు ఇప్పటికీ గుర్తించలేదు. దీనిపై పరిశోధనలు కొనసాగిస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా పేర్కొంది. కాగా, తీవ్ర కొవిడ్ ఇన్ఫెక్షన్ బారినపడిన కొందరిలో రక్తం గడ్డకట్టే దుష్ప్రభావం తలెత్తడానికి ప్రధాన కారణం యాంటీబాడీల అసాధారణ ప్రతిస్పందనే అని బ్రిటన్లోని ఇంపీరియల్ కాలేజ్ లండన్ పరిశోధకులు వెల్లడించారు. కరోనా వైరస్పై పోరాడేందుకు.. రోగ నిరోధక వ్యవస్థ విడుదల చేసే యాంటీబాడీలు ప్లేట్లెట్ల పనితీరు సాధారణ స్థాయి కంటే వేగవంతమయ్యేలా చేస్తున్నాయని తెలిపారు. ఫలితంగా తీవ్ర ఇన్ఫెక్షన్ కలిగిన రోగుల్లో రక్తం గడ్డకట్టే సమస్య ఉత్పన్నమవుతోందని పేర్కొన్నారు.