నిజామాబాద్ క్రైం, నవంబర్ 27 : పోలీసుశాఖలో మహిళా ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలం దక్కింది. ఇటీవల మహిళా కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు కల్పించారు. గత ప్రభుత్వాలు ఏనాడూ తమ గురించి పట్టించుకున్న పాపాన పోలేదని.. కానీ డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల అవసరాలను గుర్తించి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని మహిళా సిబ్బంది అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 317 జీవో అమలు చేయడంతో స్థానికులైన తమకు ఎంతో మేలు చేకూరుతుందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే ఇటీవల పోలీస్ శాఖలో మహిళా కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు కల్పించడంతో సీఎం కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుల్గా పని చేస్తున్న 2002 బ్యాచ్కు చెందిన ఒక్కరితో పాటు 2009వ బ్యాచ్కు చెందిన మరో నలుగురు ఎస్సీ మహిళా కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు కల్పించారు.
డీజీపీ సూచనల మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్.నాగరాజు వారికి ప్రమోషన్ కాపీలు అందజేసి అభినందించారు. ఆగస్టు 1న పదోన్నతి కల్పించి 10 రోజుల వ్యవధిలోనే కోరుకున్న పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ ఇవ్వడంపై మహిళా కానిస్టేబుళ్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళా ఉద్యోగులకు ఎంతో మేలు చేశారు
ఇప్పటి వరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం మహిళలను ఏ మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తున్నది. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ద్వారా మాలాంటి ఎస్సీ మహిళలకు పోలీసు డిపార్ట్మెంట్లో ఇంత త్వరగా ప్రమోషన్లు వచ్చాయి. ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు.
–అర్చన(ఇందల్వాయి)
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
ఎస్సీ మహిళా కానిస్టేబుళ్లు అయిన మాకు ప్రమోషన్లు కల్పించినందుకు ప్రభుత్వంతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు. మాలాంటి మహిళలు, చిన్న ఉద్యోగుల ప్రమోషన్ విషయంలో త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.
–సుమతీ (షీ టీమ్, బాల్కొండ)